ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల బాలుడు
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:21 PM
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బన్సీలాల్నగర్లోని అమ్మ టెంపుల్ సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బన్సీలాల్నగర్లోని అమ్మ టెంపుల్ సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని పత్య ప్రశాంత్గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రశాంత్ తండ్రి ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం తండ్రి పనికి వెళ్లిపోయాడు. ప్రశాంత్ సోదరిని హాస్టల్లో దింపేందుకు తల్లి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మధ్యాహ్నం తండ్రితో ఫోన్లో మాట్లాడిన ప్రశాంత్ అన్నం తిన్నానని చెప్పాడు. సాయంత్రం 7 గంటలకు తండ్రి ఫోన్ చేయగా ప్రశాంత్ స్పందించలేదు. రాత్రి 8:30 గంటలకు ఇంటికి చేరుకున్న తండ్రికి ఉరి వేసుకున్న స్థితిలో ప్రశాంత్ కనిపించాడు. వెంటనే కిందకు దించి చూడగా అప్పటికే అతడు మృతి చెందినట్లు గుర్తించాడు. ప్రశాంత్ తల్లిదండ్రులు ఈ ఘటనపై రాత్రి 9 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించారు.
తమకు ఎవరిపైనా అనుమానం లేదని ప్రశాంత్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రెండు నెలల క్రితం పాఠశాలకు వెళ్లనని చెప్పడంతో ప్రశాంత్ను మందలించినట్లు తెలిపాడు. ఆ సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రశాంత్ రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చాడని వెల్లడించాడు. ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వాస్తవాలను దాస్తున్నారు.. కేంద్రంపై ఎంపీ జైరాం రమేశ్ విమర్శలు
అఫ్గాన్ సిరీస్కు ముందు టీమిండియాకు షాక్.. మళ్లీ గాయపడ్డ హార్దిక్ పాండ్య!