Share News

నేనూ బ్రిజ్‌భూషణ్‌ బాధితురాలినే

ABN , Publish Date - May 04 , 2026 | 02:34 AM

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ తనను లైంగికంగా వేధించాడని ఒలింపియన్‌ వినేశ్‌ ఫొగట్‌ వెల్లడించింది...

నేనూ బ్రిజ్‌భూషణ్‌ బాధితురాలినే

లైంగికంగా వేధించాడు

స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ సంచలన వెల్లడి

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ తనను లైంగికంగా వేధించాడని ఒలింపియన్‌ వినేశ్‌ ఫొగట్‌ వెల్లడించింది. ఈమేరకు వీడియో ద్వారా ఆమె ఈ సంచలన విషయాన్ని బయటపెట్టింది. గతంలో బ్రిజ్‌భూషణ్‌ లైంగిక వేధింపులపై ఆరుగురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఆ ఆరుగురు రెజ్లర్లలో తానూ ఒకరినని వినేశ్‌ తెలిపింది. ‘బాధితుల గౌరవానికి, మర్యాదకు సంబంధించిన విషయం కనుక వారి పేర్లు వెల్లడించకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చెబుతున్నాయి. కానీ కొన్ని పరిస్థితుల రీత్యా ఈ విషయాన్ని చెబుతున్నా. ఫిర్యాదు చేసిన రెజ్లర్లలో నేను కూడా ఉన్నా. మా వాంగ్మూలాల సేకరణ జరుగుతోంది’ అని వినేశ్‌ ఆ వీడియోలో వివరించింది. బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద 2023లో రెజ్లర్లు చేసిన ఆందోళనలో వినేశ్‌ ప్రముఖ పాత్ర పోషించింది.


మాకేమైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత

జాతీయ సీనియర్‌ ఓపెన్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌ను ఈనెల 10 నుంచి 12 వరకు ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో డబ్ల్యూఎ్‌ఫఐ నిర్వహిస్తోంది. సెప్టెంబరులో ఆసియా క్రీడలు జరుగుతుండడంతో ఈ టోర్నీకి ప్రాధాన్యమేర్పడింది. ఇక..పారిస్‌ ఒలింపిక్స్‌ అనంతరం 18 నెలల తర్వాత మళ్లీ రెజ్లింగ్‌ బరిలో దిగుతున్న వినేశ్‌ ఈ టోర్నీలో 57 కిలోల విభాగంలో తలపడుతోంది. గోండా బ్రిజ్‌భూషణ్‌ స్వస్థలం. పైగా..టోర్నీని ఓ ప్రైవేటు కాలేజీలో నిర్వహిస్తున్నారు. ఆ కాలేజీ కూడా బ్రిజ్‌భూషణ్‌దేనని వినేశ్‌ వెల్లడించింది. అందువల్ల..ఈ టోర్నీ నిష్పక్షపాతకంగా జరిగే అవకాశం లేదన్న వినేశ్‌.. ఈ పోటీలలో తనకు, తన బృందానికి ఏదైనా జరిగితే అందుకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని ఆ వీడియోలో తెలిపింది. బ్రిజ్‌భూషణ్‌ డబ్ల్యూఎ్‌ఫఐ నుంచి వైదొలగినా..తన అనుచరుడైన ప్రస్తుత అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌ ద్వారా పరోక్షంగా పెత్తనం చెలాయిస్తున్నాడని వినేశ్‌ ఆరోపించింది.

వేదికను మార్చం: ర్యాంకింగ్‌ టోర్నీ వేదికను గోండా నుంచి మార్చే ప్రసక్తి లేదని డబ్ల్యూఎ్‌ఫఐ అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌ స్పష్టంజేశాడు. వినేశ్‌తోపాటు ఇతర స్టార్‌ రెజ్లర్ల భద్రతకు తనది పూచి అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి..

200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా

అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే

Updated Date - May 04 , 2026 | 02:34 AM