Share News

సింధు దూరం

ABN , Publish Date - Mar 03 , 2026 | 05:30 AM

ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీకి ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు దూరమైంది. ఈ మెగా టోర్నమెంట్‌ మంగళవారం ఆరంభం కానుంది. కాగా, టోర్నీలో పాల్గొనేందుకు శనివారం భారత్‌ నుంచి...

 సింధు దూరం

నేటి నుంచి ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌

‘బాయ్‌’ కార్యదర్శి మిశ్రా ప్రకటన

బరిలో లక్ష్యసేన్‌, సాత్విక్‌ జోడీ

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీకి ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు దూరమైంది. ఈ మెగా టోర్నమెంట్‌ మంగళవారం ఆరంభం కానుంది. కాగా, టోర్నీలో పాల్గొనేందుకు శనివారం భారత్‌ నుంచి బయలుదేరిన సింధు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ మూసివేయడంతో రెండ్రోజులుగా అక్కడే చిక్కుకుపోయింది. ప్రస్తుతం సింధు, తన కోచింగ్‌ బృందంతో కలిసి దుబాయ్‌లోని ఓ హోటల్‌లో సురక్షితంగా ఉంది. అయితే, పరిస్థితులు ఇంకా చక్కబడకపోవడంతో టోర్నీ వేదికైన బర్మింగ్‌హామ్‌ వెళ్లడం సింధుకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో.. సింధు టోర్నీలో పాల్గొనడం లేదని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) కార్యదర్శి సంజయ్‌ మిశ్రా సోమవారం రాత్రి ప్రకటించాడు. తొలి రౌండ్‌లో సుపనిడా కెటతోంగ్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు తలపడాల్సి ఉంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, ఆయుష్‌ శెట్టి బరిలోకి దిగనున్నారు. వీరు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందుగానే లండన్‌ చేరుకొన్నారు. తొలి రౌండ్‌లో వరల్డ్‌ నెం:1 షి యుకి (చైనా)తో సేన్‌ తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోడ్‌, ఉన్నతి హుడా ఆడనున్నారు. ఉన్నతి ఆఫ్రికా మార్గంలో ఇంగ్లండ్‌ చేరుకొంది. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి, ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్‌, మిక్స్‌డ్‌లో ధ్రువ్‌ కపిల-తనీషా క్రాస్టో, రోహన్‌ కపూర్‌-రుత్విక శివానీ జంటలు బరిలో నిలవనున్నాయి.

ఇవి కూడా చదవండి:

విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?

అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు

Updated Date - Mar 03 , 2026 | 05:30 AM