Share News

చాంపియన్‌ వన్స్‌మోర్‌

ABN , Publish Date - Jun 01 , 2026 | 03:35 AM

ఐపీఎల్‌-19వ సీజన్‌లోనూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విజేతగా నిలిచింది. ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఏకపక్ష ఫైనల్లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది...

చాంపియన్‌  వన్స్‌మోర్‌

బెంగళూరుదే ఐపీఎల్‌ ట్రోఫీ

వరుసగా రెండో టైటిల్‌ సొంతం

ఫైనల్లో గుజరాత్‌పై ఘనవిజయం

అదరగొట్టిన విరాట్‌ కోహ్లీ

అహో.. బెంగళూరు. సుదీర్ఘ నిరీక్షణకు తెర దించి గతేడాది తొలి ఐపీఎల్‌ కప్‌ను ముద్దాడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నుంచి మరో అ‘ద్వితీయ’ షో. గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్‌కు ముందు సమవుజ్జీల పోరుగా భావించినా.. తాము బరిలోకి దిగితే వార్‌ వన్‌సైడే అని రజత్‌ సేన నిరూపించింది.

ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి అతికష్టంగా 150 పరుగులు దాటిన టైటాన్స్‌కు ఫలితమేంటో ముందే తెలిసొచ్చింది. అనంతరం ఛేజింగ్‌ రారాజు విరాట్‌ కోహ్లీ అజేయ హాఫ్‌ సెంచరీతో కడదాకా నిలిచి, బెంగళూరు వరుసగా రెండోసారీ కప్‌ను ముద్దాడేలా చేశాడు. అటు బెంగళూరు ఫ్యాన్స్‌ ‘ఈ సాలనూ కప్‌ నమ్దే’ అంటూ విజయ సంబరాలతో మైమరిచిపోయారు. ఇక క్వాలిఫయర్‌2లో చూపిన పోరాట పటిమను సొంత గడ్డపై పునరావృతం చేయలేక గిల్‌ సేన నిరాశలో మునిగింది.

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌-19వ సీజన్‌లోనూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విజేతగా నిలిచింది. ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఏకపక్ష ఫైనల్లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. విరాట్‌ కోహ్లీ (42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 నాటౌట్‌) అజేయ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆర్‌సీబీకిది వరుసగా రెండో టైటిల్‌ కాగా.. అటు 2022లో తొలిసారి విజేతగా నిలిచిన గుజరాత్‌ ఫైనల్లో ఓడడం ఇది రెండోసారి. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. సుందర్‌ (37 బంతుల్లో 5 ఫోర్లతో 50 నాటౌట్‌), నిశాంత్‌ (18 బంతుల్లో 3 ఫోర్లతో 20), బట్లర్‌ (23 బంతుల్లో 1 ఫోర్‌తో 19) మాత్రమే రాణించారు. రసిఖ్‌కు మూడు.. భువనేశ్వర్‌, హాజెల్‌వుడ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో బెంగళూరు 18 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32), డేవిడ్‌ (17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 24) వేగం చూపారు. రషీద్‌కు రెండు వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా విరాట్‌ కోహ్లీ, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా వైభవ్‌ సూర్యవంశీ నిలిచారు.


8-Sports.jpg

విరాట్‌ అజేయంగా..

స్వల్ప ఛేదనను ఆర్‌సీబీ మెరుపు వేగంతో ఆరంభించింది. ఓపెనర్‌ విరాట్‌ కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మధ్య ఓవర్లలో వేగంగా వికెట్లు కోల్పోయినా తను మాత్రం చివరి వరకు ఓపిగ్గా క్రీజులో నిలిచాడు. అలాగే లక్ష్యం తక్కువే కావడంతో ఆర్‌సీబీకి కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. తొలి ఓవర్‌లో సిరాజ్‌ ఐదు పరుగులే ఇచ్చినా ఆ తర్వాత ఆర్‌సీబీ దూసుకెళ్లింది. రెండో ఓవర్‌లో మరో ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ 4,6,4,4తో 18 రన్స్‌.. నాలుగో ఓవర్‌లో విరాట్‌ 4,4,6,4తో 19 రన్స్‌ రాబట్టడంతో జట్టు స్కోరు 4 ఓవర్లలోనే 55 పరుగులకు చేరింది. అయితే జోరు మీదున్న అయ్యర్‌ను సిరాజ్‌ అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 27 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు దేవ్‌దత్‌ (1)ను రబాడ పెవిలియన్‌కు చేర్చడంతో పవర్‌ప్లేలో జట్టు 70/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత పరుగుల జోరు నెమ్మదించింది. దీనికి తోడు స్పిన్నర్‌ రషీద్‌ 9వ ఓవర్‌లో రజత్‌ (15), క్రునాల్‌ (1) వికెట్లు తీయడంతో గుజరాత్‌లో జోష్‌ కనిపించింది. కానీ విరాట్‌ నిలకడగా క్రీజులో నిలిచాడు. అడపాదడపా బౌండరీలతో జట్టును విజయం దిశగా నడిపించాడు. అలాగే ఓ ఫోర్‌తో 25 బంతుల్లోనే తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీని పూర్తి చేశాడు. టిమ్‌ డేవిడ్‌ ఉన్న కాసేపు వేగంగా ఆడి 14వ ఓవర్‌లో వెనుదిరిగాడు. అప్పటికి ఆరు ఓవర్లలో 24 పరుగులే అవసరం కావడంతో మ్యాచ్‌ ఫలితమేమిటో తెలిసిపోయింది. 16వ ఓవర్‌లో విరాట్‌ క్యాచ్‌ను గిల్‌ అందుకున్నా.. డైవింగ్‌ సమయంలో బంతి నేలకు తాకడంతో నాటౌట్‌గా ప్రకటించారు. ఆ తర్వాత జితేశ్‌ (11 నాటౌట్‌) సహాయంతో విరాట్‌ 4,6తో మరో 12 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.

6-Sports.jpg

బౌలర్లదే పైచేయి

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ పరుగుల కోసం అల్లాడింది. అటు ఆర్‌సీబీ బౌలర్లు బౌన్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ వికెట్ల వేట సాగించగా.. టైటాన్స్‌ పూర్తి ఒత్తిడిలో పడింది. ఏ ఒక్క బ్యాటరూ క్రీజులో నిలిచే ప్రయత్నం చేయలేదు. ఈ కీలక మ్యాచ్‌లోనూ మిడిలార్డర్‌ ఆకట్టుకోలేకపోయింది. వాషింగ్టన్‌ సుందర్‌ మాత్రమే ఆఖరి వరకు పోరాడి గౌరవప్రదమైన స్కోరందించాడు. ఇక సక్సె్‌సఫుల్‌ ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్న గిల్‌ (10), సుదర్శన్‌ (12) తొలి నాలుగు ఓవర్లలోనే పెవిలియన్‌కు చేరడంతో టైటాన్స్‌ ఆట ఒక్కసారిగా గతి తప్పింది. బౌలర్లు కట్టడి చేయడంతో జట్టు పవర్‌ప్లేలో 45/2 స్కోరు మాత్రమే చేయగలిగింది. యువ బ్యాటర్‌ నిశాంత్‌ మూడు ఫోర్లతో ఆకట్టుకున్నా ఎనిమిదో ఓవర్‌లో రసిఖ్‌ అతడిని అవుట్‌ చేశాడు. అయితే క్రీజులో వెటరన్‌ బట్లర్‌-సుందర్‌ ఉండడంతో టైటాన్స్‌ ఆశలు వదులుకోలేదు.


పదో ఓవర్‌లో సుందర్‌ క్యాచ్‌ను కాక్స్‌ పట్టినా అతడి చేతి వేళ్లు నేలను తాకడంతో నాటౌట్‌గా ప్రకటించారు. మరోవైపు మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ క్రునాల్‌, రసిఖ్‌ మరింత పట్టు బిగించగా 7-12 ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. ఒత్తిడికి లోనైన బట్లర్‌.. క్రునాల్‌ ఓవర్‌లో ముందుకు వచ్చి షాట్‌ ఆడి స్టంపౌట్‌ అయ్యాడు. 13వ ఓవర్‌లో అర్షద్‌ (15) వచ్చీ రాగానే వీరి ఇన్నింగ్స్‌లో తొలి సిక్సర్‌ బాదాడు. తర్వాతి ఓవర్‌లో సుందర్‌ రెండు ఫోర్లు, అర్షద్‌ మరో సిక్సర్‌తో 16 పరుగులు సమకూరడంతో జట్టు గాడిలో పడినట్టనిపించింది. కానీ ఓవర్‌ వ్యవధిలోనే అర్షద్‌తో పాటు తెవాటియా (7) కూడా వెనుదిరగడం దెబ్బతీసింది. 18వ ఓవర్‌లో సుందర్‌ 4,4, హోల్డర్‌ (7) 4తో 16 రన్స్‌ రావడం కాస్త ఊరటనిచ్చింది. చివరి ఓవర్‌లో రషీద్‌ (7) వికెట్‌ కోల్పోగా.. సుందర్‌ 37 బంతుల్లో అజేయ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి స్కోరును 150 దాటించగలిగాడు.

స్కోరుబోర్డు

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 12, గిల్‌ (సి) రజత్‌ (బి) హాజెల్‌వుడ్‌ 10, నిషాంత్‌ (సి) పడిక్కళ్‌ (బి) రసిఖ్‌ 20, బట్లర్‌ (స్టంప్డ్‌) జితేశ్‌ (బి) క్రునాల్‌ 19, వాషింగ్టన్‌ (నాటౌట్‌) 50, అర్షద్‌ (సి) రసిఖ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 15, తెవాటియా (సి) రజత్‌ (బి) రసిఖ్‌ 7, హోల్డర్‌ (సి) హాజెల్‌వుడ్‌ (బి) భువనేశ్వర్‌ 7, రషీద్‌ (సి) షెఫర్డ్‌ (బి) రసిఖ్‌ 7, రబాడ (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 155/8; వికెట్ల పతనం: 1-22, 2-26, 3-55, 4-73, 5-99, 6-115, 7-142, 8-151; బౌలింగ్‌: డఫీ 4-0-38-0, భువనేశ్వర్‌ 4-0-29-2, హాజెల్‌వుడ్‌ 4-0-37-2, రసిఖ్‌ 4-0-27-3, క్రునాల్‌ 4-0-23-1.

బెంగళూరు: వెంకటేశ్‌ (సి) రబాడ (బి) సిరాజ్‌ 32, కోహ్లీ (నాటౌట్‌) 75, పడిక్కళ్‌ (సి) అర్షద్‌ (బి) రబాడ 1, రజత్‌ పటీదార్‌ (సి) రబాడ (బి) రషీద్‌ 15, క్రునాల్‌ (ఎల్బీ) రషీద్‌ 1, టిమ్‌ డేవిడ్‌ (సి) బట్లర్‌ (బి) అర్షద్‌ 24, జితేశ్‌ (నాటౌట్‌) 11, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 18 ఓవర్లలో 161/5; వికెట్ల పతనం: 1-62, 2-63, 3-89, 4-91, 5-132; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-36-1, రబాడ 3-0-44-1, హోల్డర్‌ 2-0-16-0, రషీద్‌ 4-0-25-2, అర్షద్‌ 4-0-32-1, ప్రసిద్ధ్‌ 1-0-7-0.

1

ఒకే ఐపీఎల్‌ సీజన్‌లో ఎక్కువ వికెట్లు (28) తీసిన రెండో భారత బౌలర్‌గా షమి (2023లో)తో సంయుక్తంగా నిలిచిన భువనేశ్వర్‌. హర్షల్‌ పటేల్‌ (2021లో 32) ముందున్నాడు.

1

ఐపీఎల్‌ ఫైనల్స్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ (3.3 ఓవర్‌లో) నమోదు చేసిన జట్టుగా బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌.

1

కెప్టెన్సీ చేపట్టిన తొలి రెండు సీజన్లలోనూ జట్టును విజేతగా నిలిపిన సారథిగా రజత్‌ పటీదార్‌.


ప్రైజ్‌మనీ విజేతకు : రూ. 20 కోట్లు

రన్నర్‌పకు : రూ.12.50 కోట్లు

4-Sports.jpg

అత్యధిక పరుగులు

  • వైభవ్‌ సూర్యవంశీ (రాజస్థాన్‌) 776

  • శుభ్‌మన్‌ గిల్‌ (గుజరాత్‌) 732

  • సాయి సుదర్శన్‌ (గుజరాత్‌) 722

  • విరాట్‌ కోహ్లీ (బెంగళూరు) 675

  • హెన్రిచ్‌ క్లాసెన్‌ (హైదరాబాద్‌) 624

ఎక్కువ సిక్స్‌లు: వైభవ్‌ సూర్యవంశీ (72, రాజస్థాన్‌)

ఓ జట్టు అత్యధిక స్కోరు : పంజాబ్‌ (265/4)

ఆటగాడి అత్యధిక స్కోరు : రాహుల్‌ (152 నాటౌట్‌, ఢిల్లీ)

ఈ సీజన్‌లో అత్యధిక శతకాలు : సంజూ శాంసన్‌ (2, చెన్నై)

బెస్ట్‌ బౌలింగ్‌: మొహిసిన్‌ ఖాన్‌ (5/23, లఖ్‌నవూ)

అత్యధిక వికెట్లు

కగిసో రబాడ (గుజరాత్‌) 29

భువనేశ్వర్‌ (బెంగళూరు) 28

జోఫ్రా ఆర్చర్‌ (రాజస్థాన్‌) 25

రషీద్‌ ఖాన్‌ (గుజరాత్‌) 21

అన్షుల్‌ కాంబోజ్‌ (చెన్నై) 21

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఇవి కూడా చదవండి:

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 01 , 2026 | 03:35 AM