Share News

గెలిచారు.. చరిత్ర సృష్టించారు

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:20 AM

ఆల్‌రౌండ్‌ షో ప్రదర్శించిన భారత మహిళలు ఆస్ట్రేలియాపై 2-1తో టీ20 సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించారు. శనివారం ఇక్కడ జరిగిన మూడో, ఆఖరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన 17 పరుగులతో...

గెలిచారు.. చరిత్ర సృష్టించారు

ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ కైవసం

మంధాన, జెమీమా హాఫ్‌ సెంచరీలు

శ్రేయంక, శ్రీచరణి వికెట్ల వేట

అడిలైడ్‌: ఆల్‌రౌండ్‌ షో ప్రదర్శించిన భారత మహిళలు ఆస్ట్రేలియాపై 2-1తో టీ20 సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించారు. శనివారం ఇక్కడ జరిగిన మూడో, ఆఖరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన 17 పరుగులతో ఆతిథ్య జట్టును ఓడించింది. బలమైన ఆసీ్‌సపై ఆ దేశంలో మన మహిళలు పొట్టి సిరీస్‌ సాధించడం 2016 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మొదట భారత్‌ 20 ఓవర్లలో 176/6 స్కోరు చేసింది. స్మృతీ మంధాన (55 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82), జెమీమా (59) అర్ధ శతకాలతో అదరగొట్టారు. మంధాన, జెమీమా రెండో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టుకు రెండో వికెట్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక ఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 159/9 స్కోరుకే పరిమితమై ఓడింది. గార్డ్‌నర్‌ (57), లిచ్‌ఫీల్డ్‌ (26), సదర్లాండ్‌ (14) మినహా అంతా విఫలమయ్యారు. స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్‌, శ్రీచరణి చెరో మూడు వికెట్లతో కంగారూల పనిబట్టారు. అరుంధతి రెడ్డి రెండు వికెట్లు పడగొట్టింది. స్మృతి మంధాన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది. మల్టీ ఫార్మాట్‌ సిరీ్‌సలో భాగంగా తదుపరి మూడు వన్డేలలో భారత్‌-ఆసీస్‌ తలపడనున్నాయి. మొదటి మ్యాచ్‌ మంగళవారం బ్రిస్బేన్‌లో జరగనుంది.

సంక్షిప్త స్కోర్లు

భారత్‌: 20 ఓవర్లలో 176/6 (మంధాన 82, జెమీమా 59, రిచా ఘోష్‌ 18, సదర్లాండ్‌ 2/34).

ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 159/9 (గార్డ్‌నర్‌ 57, లిచ్‌ఫీల్డ్‌ 26, సదర్లాండ్‌ 14, శ్రేయాంక 3/22, శ్రీచరణి 3/32, అరుంధతి 2/35).

3

టీ20లలో 2500లకుపైగా పరుగులు స్కోరు చేసిన మూడో భారత బ్యాటర్‌ జెమీమా. మంధాన, హర్మన్‌ప్రీత్‌ ఇంతకుముందు ఈ ఫీట్‌ సాధించారు.

ఇవీ చదవండి:

'ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందే'

ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్

Updated Date - Feb 22 , 2026 | 05:20 AM