వైభవ్ ఏం చేస్తాడో.. నాకైతే డౌటే: ఏబీ డివిలియర్స్
ABN , Publish Date - Jun 08 , 2026 | 10:12 AM
పొట్టి ఫార్మెట్లో తనకు తిరుగేలేదని నిరూపించుకున్న వైభవ్ సూర్యవంశీ టెస్టు క్రికెట్పై కూడా దృష్టిపెడితే బాగుంటుందని దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే టీ20ల్లో తన రేంజ్ ఏంటో ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో ఏకంగా 776 పరుగులతో తాను చిచ్చర పిడుగు అని అనిపించుకున్నాడు. 15 ఏళ్ల చిరు ప్రాయంలోనే టీమిండియా టీ20 జట్టుకు కూడా ఎంపికై అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. వన్డేలు, టెస్టులపై కూడా తనకు ఆసక్తి ఉందని వైభవ్ ఒక సందర్భంలో చెప్పాడు. ఈ విషయమై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘అతడికి అద్భుతమైన టాలెంట్ ఉంది. కానీ రెడ్ బాల్ క్రికెట్ విషయంలో అతడు ఏం చేస్తాడో నేనైతే ఇప్పుడే చెప్పలేను. కావాలనుకుంటే అతడు ఏదైనా చేయగలడు. కానీ టెస్టులపై అతడి ఆసక్తి ఏమేరకు ఉందో తెలియదు. నాకైతే ఈ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇందులో కాలుపెట్టాలనుకుంటే మాత్రం కొన్ని సవాళ్లు తప్పవు. అతడు టెస్టులపై కూడా దృష్టిపెట్టాలనే కోరుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో..’ అని డివిలియర్స్ అన్నారు.
దక్షిణాఫ్రికా అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరైన డివిలియర్స్ తను ఆడే రోజుల్లో ఎన్నో కొత్త షాట్స్ను కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం క్రికెట్లో కూడా ఏఐ సాంకేతికత ప్రవేశించడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆడే రోజుల్లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి ఉంటే తనకు మరింత ప్రయోజనం కలిగి ఉండేదని చెప్పారు. ఒక్కో షాట్లో రిస్క్ ఎంత ఉంటుందో ఏఐ ద్వారా విశ్లేషించే అవకాశం ఉండేదని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
విప్లవాత్మక మార్పులతో ఫీఫా వరల్డ్ కప్