నడిరోడ్డుపై గొడవ.. కారు బానెట్పై ప్రత్యర్థి ఉండగానే..
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:28 PM
నడిరోడ్డుపై ఇద్దరు డ్రైవర్ల మధ్య చోటుచేసుకున్న గొడవ దారుణానికి తెరతీసింది. ఓ కారు డ్రైవర్.. గూడ్స్ వెహికల్ డ్రైవర్ను చంపడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బెంగళూరు, ఫిబ్రవరి 12: నడిరోడ్డుపై ఇద్దరు డ్రైవర్ల మధ్య చోటుచేసుకున్న గొడవ దారుణానికి తెరతీసింది. ఓ కారు డ్రైవర్ .. గూడ్స్ వెహికల్ డ్రైవర్ను చంపడానికి ప్రయత్నించాడు. గూడ్స్ వెహికల్ డ్రైవర్ కారు బానెట్పై ఉండగానే ఓ కిలోమీటర్ వరకు దూసుకెళ్లిపోయాడు. ఈ సంఘటన కర్ణాటకలో బుధవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఓల్డ్ ఎయిర్పోర్టు రోడ్డుపై కారు, గూడ్స్ వెహికల్ ఢీకొట్టుకున్నాయి.
దీంతో కారు డ్రైవర్ సురేశ్, గూడ్స్ వెహికల్ డ్రైవర్ నంజుండల మధ్య గొడవ మొదలైంది. గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత సురేశ్ తన కారు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. నంజుండ కారు బానెట్ మీదకు ఎక్కి నిలబడ్డాడు. ఆగ్రహానికి గురైన సురేశ్ కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. నంజుండ కారు బానెట్పై పడిపోయాడు. అయినా కూడా సురేశ్ కారును ఆపలేదు. వేగంగా అక్కడినుంచి దూసుకెళ్లిపోయాడు. నంజుండ ప్రాణ భయంతో కారు బానెట్ పట్టుకుని అలాగే ఉండిపోయాడు.
కారు ఆపమంటూ కేకలు పెట్టాడు. సురేశ్ ఓ కిలోమీటర్ వెళ్లిన తర్వాత కారును ఆపాడు. ఈ దారుణం చోటుచేసుకున్న సమయంలో సురేశ్ భార్య కూడా కారులోనే ఉంది. ఆ కారు ఆమె పేరు మీదే రిజిస్టర్ అయి ఉంది. ఇక, ఈ సంఘటనపై నంజుండ హలసూరు పోలీసులను ఆశ్రయించాడు. సురేశ్పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. సురేశ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అంబటి రాంబాబుపై పీటీ వారెంట్.. కోర్టులో హాజరపరిచిన పోలీసులు
శ్వేత విప్లవంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆదర్శం: చినజీయర్ స్వామి