యూఏఈలో స్కామ్.. భారతీయులకు ఎంబసీ అలర్ట్
ABN , Publish Date - Sep 01 , 2026 | 09:36 AM
వీసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని యూఏఈలోని భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ అప్రమత్తం చేసింది. వీసాల విషయాల్లో సాయం చేస్తామని వచ్చే అనధికారిక ఏజెంట్లు, వ్యక్తులకు బయోమెట్రిక్ వివరాలు ఇవ్వవద్దని సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: వీసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని యూఏఈలోని భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ అప్రమత్తం చేసింది. వీసాల విషయాల్లో సాయం చేస్తామని వచ్చే అనధికారిక ఏజెంట్లు, వ్యక్తులకు బయోమెట్రిక్ వివరాలు ఇవ్వవద్దని సూచించింది. వీసా రెగ్యులరైజేషన్, ఎమర్జెన్సీ సర్టిఫికేట్స్ జారీ, ఎగ్జిట్ పర్మిట్లు, ఎమిరేట్ ఐడీలు, ఉపాధి విషయాల్లో అవగాహనతో ఉండాలని సూచించింది.
యూఏఈలో వెలుగు చూస్తున్న స్కామ్స్లో పలువురు బ్లూకాలర్ ఉద్యోగులు బాధితులుగా మారుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు ఎంబసీ వెల్లడించింది. మోసపూరితంగా బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తున్న నిందితులు వాటితో ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పింది. బాధితులకు తెలియకుండానే వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరవడం, లోన్లు, క్రెడిట్ కార్డులు తీసుకోవడం వంటివి చేస్తున్నారని చెప్పింది. ఈ స్కామ్ బారిన పడితే అప్పులు మిగిలడంతో పాటు నిషేధానికి గురయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది.
ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండేందుకు భారతీయులు తమ బయోమెట్రిక్, పాస్పోర్టు వివరాలను అనధికారిక ఏజెంట్లు, వ్యక్తులతో పంచుకోవద్దని సూచించింది. యూఏఈ ప్రభుత్వ కేంద్రాలు, కౌంటర్లలోనే ఈ వివరాలను ఇవ్వాలని సూచించింది. భారతీయ పాస్పోర్టులు, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ల జారీ కోసం భారతీయ కాన్సులేట్లు, లేదా ఎంబసీ బయోమెట్రిక్ వివరాలను కోరవని కూడా స్పష్టం చేసింది. బయోమెట్రిక్ వివరాలను ఎవరైనా అడిగితే వెంటనే ఎంబసీకి సమాచారం ఇవ్వాలని కూడా అధికారులు చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
రష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి.. విదేశాంగ శాఖ సెక్రటరీ వెల్లడి
రైల్వే అభివృద్ధిలో తెలంగాణకు పెద్దపీట కేంద్ర మంత్రి కిషన్రెడ్డి