తల్లిదండ్రులను చంపి తనూ ఆత్మహత్యకు పాల్పడ్డ ఎన్నారై బాలుడు
ABN , Publish Date - Feb 27 , 2026 | 07:34 AM
తల్లిదండ్రులను చంపిన ఓ భారతీయ టీనేజర్ తనూ ఆత్మహత్య చేసుకున్న ఘటన సౌదీ అరేబియా రాజధాని రియాధ్లో చోటుచేసుకుంది. విషయం తెలిసి స్థానిక ఎన్నారైలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలో గురువారం ఓ భారతీయ టీనేజర్ తన తల్లిదండ్రులను హతమార్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజధాని రియాధ్ నగరంలో తెలుగు ప్రవాసీయులు ఎక్కువగా నివసించే హరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాజమండ్రికి చెందిన గాలి రవి, గాలి శ్రీదేవి దంపతుల తనయుడు యెజ్ర ప్రభాకర్ 12వ తరగతి చదువుతున్నాడు. ఆ దంపతులకు అతడు ఏకైక సంతానం.
రవి ఒక బ్యాంకులో, శ్రీదేవి ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ప్రభాకర్ స్థానిక భారతీయ పాఠశాలలో చదువుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సీబీయస్ఈ వార్షిక పరీక్షలు కూడా రాస్తున్నాడు. అయితే, అతడు గురువారం తల్లిదండ్రులను దారుణంగా నరికి హత్య చేశాడు. ఆ తరువాత తాను మరో ప్రదేశానికి వెళ్ళి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం. తల్లిదండ్రులను హత్య చేశాక అతడు మొదట ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్న భోజనం తిని ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోన్నట్లుగా చెబుతున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ దారుణం గురించి తెలిసిన వెంటనే రియాధ్లోని తెలుగు ప్రవాసీ సమాజం దిగ్భ్రాంతికి గురైంది. తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. రవి కుటుంబం అందరితో కలిసిమెలిసి ఉండేదని స్థానిక ఎన్నారైలు గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం, కుటుంబసభ్యుల మధ్య ఆప్యాయత లేమి తదితర అంశాలు స్థానిక తెలుగు ఎన్నారైల మధ్య మరోసారి చర్చకు వచ్చాయి.
ఈ వార్తలూ చదవండి:
వాషింగ్టన్ డీసీలో శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
వెంకన్న భక్తులకు వైసీపీ క్షమాపణ చెప్పాలి: గల్ఫ్ టీడీపీ నేత