నెదర్లాండ్స్లో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు
ABN , Publish Date - Jun 17 , 2026 | 10:54 AM
నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెదర్లాండ్స్ ఎన్ఆర్ఐ టీడీపీ కార్యదర్శి వెంకట్ కృష్ణ కోక, నవీన్ ఆచంట ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.
ఇంటర్నెట్ డెస్క్: నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ నగరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెదర్లాండ్స్ ఎన్ఆర్ఐ టీడీపీ కార్యదర్శి వెంకట్ కృష్ణ కోక, నవీన్ ఆచంట సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాస తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ఒక జాతి అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేది మాతృభాషేనని ఎన్టీఆర్ గుర్తించి తెలుగును ప్రోత్సహించారన్నారు.

యూరప్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు కూడా ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తమ పిల్లలకు తెలుగు భాషను నేర్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. అమెరికాలోని సిలికానాంధ్ర సంస్థ సహకారంతో మాతృభాషను భావితరాలకు అందిస్తూ, మాతృభూమికి దూరంగా ఉన్నప్పటికీ మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తున్నారని అన్నారు. అలాగే, నెదర్లాండ్స్లో 'మనబడి' కార్యక్రమం ద్వారా 25 మంది వాలంటీర్లు వారానికి రెండు రోజులు, నాలుగు గంటల పాటు సుమారు 250 మంది విద్యార్థులకు తెలుగు బోధించడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. మాతృభాషను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఐరోపా ఖండంలో తెలుగు వెలుగులను విరజిమ్ముతున్న ప్రవాస తెలుగు వారందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సంపత్ ఐనంపూడి మాట్లాడుతూ.. తమ పిల్లలు తెలుగు భాషతో పాటు స్కూళ్లలో డచ్, ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ తదితర భాషలను కూడా అభ్యసిస్తున్నారని తెలిపారు. భౌగోళిక సరిహద్దులు భాషకు ఎప్పుడూ అడ్డంకులు కావని వారు నిరూపిస్తున్నారన్నారు. భాష అనేది సాంస్కృతిక వారధి.. అలాంటి అమూల్యమైన వారసత్వ సంపదను పదిలంగా కాపాడుకుంటూ భావితరాలకు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనబడి బోధనా కేంద్రాన్ని సందర్శించి, తెలుగు నేర్చుకుంటున్న విద్యార్థులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో నెథెర్లండ్స్ NRI టీడీపీ అధ్యక్షులు వివేక్ కరియావుల, ఆచంట గోపాలరావు, సత్యనారాయణ సలకి, అమర్ చంద్ రావి, వివేక్ కరిఆవుల, ప్రసాద్ రామినేని, పవన్ గుమ్మడి , ప్రవీణ్ ముమ్మినేని, చైతన్య వెల్లంకి, నవీన్ పరుచూరి, ఫణీష్ పోతురాజు, నంద ఉదయగిరి తదితరులు పాల్గొన్నారు.
Also Read:
కువైత్లో వైభవంగా బాలకృష్ణ జన్మదినోత్సవం
కువైట్లో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ వేడుకలు