Share News

హాంకాంగ్‌లో వైభవంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:46 AM

హాంకాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) తుంగ్ చుంగ్‌లోని ఎన్ఏఏసీ సెంటర్ ప్రాంగణంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించింది.

హాంకాంగ్‌లో వైభవంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
THKTS IMLD 2026

హాంకాంగ్ (21 ఫిబ్రవరి 2026): హాంకాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) తుంగ్ చుంగ్‌లోని ఎన్ఏఏసీ సెంటర్ ప్రాంగణంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (IMLD) వేడుకలను విజయవంతంగా నిర్వహించింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి కృషి, ప్రయత్నాలకు ఈ కార్యక్రమం పరాకాష్టగా నిలిచింది. ముఖ్యంగా 2021లో కొవిడ్-19 మహమ్మారి సమయంలో పిల్లలు, తల్లిదండ్రుల్లో మాతృభాషల ప్రాముఖ్యతను ప్రోత్సహించాలన్న ఆమె సంకల్పం సఫలీకృతమైందని తమ ఆనందాన్ని తెలిపారు.

2021 జూమ్ మాధ్యమంలో మొదలెట్టినప్పటినుంచి, ఈ కార్యక్రమానికి UNESCO హాంకాంగ్ అసోసియేషన్ గ్లోకల్ పీస్ సెంటర్ మద్దతునిచ్చింది. ఈ సంవత్సరం ఎన్ఏఏసీ మద్దతు ఇవ్వగా, టుమారోస్ యూత్ డెవెలెప్మెంట్ ఫండ్ లిమిటెడ్ (TYFDL) కూడా మద్దతునిచ్చారు. యూహెచ్‌కేఏ గ్లోకల్ పీస్ సెంటర్‌లో కమ్యూనిటీ విభాగానికి కో-చైర్‌గా సేవలందిస్తున్న తిరునాచ్ నాచియాపన్, ఐఎమ్ఎల్‌డీ- 2026 కన్వీనర్‌గా సహాయపడ్డారు.

ఈ సంవత్సరం ఐఎమ్ఎల్‌డీ థీమ్ ‘యూత్ వాయిసెస్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్’లో పిల్లలు ఉత్సాహంగా నృత్య గాన ప్రదర్శనలు, థీమ్ గురించి మాట్లాడారు. వారు సంస్కృతం, ఇంగ్లీష్, కొరియన్, చైనీస్, బంగ్లా, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మార్వారీ, మరాఠీలతో సహా వారి మాతృభాషల పట్ల తమ ప్రేమను ప్రదర్శించారు.

2.jpg


ఈ కార్యక్రమానికి హాంకాంగ్, మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుండి గౌరవనీయ కాన్సుల్ మిస్ సురభి గోయల్ గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేశారు. గౌరవ కాన్సుల్ తన ప్రసంగంలో, ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నందుకు అభినందించారు. పిల్లలు తమ మాతృ భాష నేర్చుకుంటున్నందుకు, అభిమానిస్తున్నందుకు వారి తల్లిదండ్రుల ప్రయత్నాలను ప్రశంసించారు. భవిష్యత్తును ప్రతిభావంతులుగా ఎదుర్కోగల ప్రపంచ పౌరులుగా మారడానికి బహుభాషా నైపుణ్యం తప్పనిసరి అని నొక్కి చెప్పారు. ఆధునిక హిందీ సాహిత్య పితామహుడు భరతేందు హరిశ్చంద్రను ఉటంకిస్తూ, మాతృభాష అన్ని జాతీయ మరియు వ్యక్తిగత పురోగతికి పునాది అని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించిందని, పాల్గొన్నవారు, హాజరైనవారు వారి మాతృభాషలను సంరక్షించడం, ప్రోత్సహించడం మెచ్చుకోతగ్గ విషయమని అన్నారు. ముఖ్య నిర్వాహకులైన జయ పీసపాటిని అభినందించారు .

NAAC ప్రాంతీయ డైరెక్టర్ మిస్ కోనీ వాంగ్, UNESCO HKGPC ప్రాజెక్ట్స్ ఆఫీసర్ మిస్టర్ మారకో క్వాన్గ్, TYFDL డైరెక్టర్ మిస్టర్ జాకీ చెంగ్, చైనా బాంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ సెంటర్ అధ్యక్షులు డా.ఇస్లాం ముహమ్మద్ ఫ్యాక్రుల్ బాబు ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచ పౌరులుగా విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలతో వ్యక్తులను సన్నద్ధం చేయడానికి మాతృభాషలు, ఇతర భాషలను నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను వీరందరూ కూడా సమర్థించారు.

3.jpg


బహుళ సంస్కృతులు కలిగిన దేశంలో, ప్రప్రథమంగా తమ సమాఖ్య విభిన్న సమాజాలను వారి మాతృభాషలను కొనియాడటానికి వేడుకగా జరుపుకోవడానికి ఒకచోట చేర్చిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం తమకు చాలా ఆనందంగా ఉందని హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక సభ్యురాలు జయ పీసపాటి అన్నారు. భాష మన వారసత్వంలో అంతర్భాగమని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. యువ తరంలో దాని ప్రాముఖ్యతను ప్రోత్సహించడం చాలా అవసరమని అన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ గౌరవ కాన్సుల్ మిస్ సురభి గోయల్ ధృవీకరణ పత్రాలను బహూకరించారు. బహుభాషావేత్తగా ఉండటానికి ప్రతిజ్ఞ చేస్తూ, తదుపరి సంవత్సరం సమావేశమవుతామని అందరూ హామీ ఇవ్వడంతో, హాలు ఆనందం, ఉత్సాహంతో నిండిపోయింది.

ప్రతి ఒక్క చిన్నారి స్వరమూ ముఖ్యమైనదిగా, ప్రతి భాషకు విలువనిచ్చే భవిష్యత్తును తాము కలిసి రూపొందిస్తున్నామని జయ పీసపటి వ్యాఖ్యానించారు. ‘అనేక భాషలు, ఒకే భవిష్యత్తు’ అన్న యునెస్కో ఉపదేశం గుర్తు చేస్తున్నట్లుగా, సగర్వంతో జరుపుకుందామని చెబుతూ జయ పీసపటి కార్యక్రమాన్ని ముగించారు.


ఈ వార్తలూ చదవండి

ఆంధ్రా మహిళ మృతదేహాన్ని స్వదేశానికి తరలించిన గల్ఫ్ టీడీపీ కార్యకర్తలు

యూఏఈలో రంజాన్ క్షమాభిక్షతో 4,700 మంది ఖైదీల విడుదల

Updated Date - Feb 22 , 2026 | 11:50 AM