మొలకలు పొడి పొడిగా...
ABN , Publish Date - Jul 20 , 2026 | 04:28 AM
పెసలు, శనగలు తదితరాలతో తయారుచేసే మొలకలు ఒక్కోసారి జిగురుగా, దుర్వాసన వస్తూ ఉంటాయి. అలాకాకుండా మొలకలు పొడిపొడిగా తాజాగా రావాలంటే...
పెసలు, శనగలు తదితరాలతో తయారుచేసే మొలకలు ఒక్కోసారి జిగురుగా, దుర్వాసన వస్తూ ఉంటాయి. అలాకాకుండా మొలకలు పొడిపొడిగా తాజాగా రావాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...
మొలకల కోసం వినియోగించే పెసలు, శనగలు తదితరాలను పురుగులు లేకుండా శుభ్రంగా ఉన్నవాటిని మాత్రమే కొని తెచ్చుకోవాలి.
వీటిని కనీసం నాలుగు సార్లు నీటితో శుభ్రంగా కడగాలి. అప్పుడే వాటిపై పేరుకున్న దుమ్ము, ధూళి, పురుగు మందుల అవశేషాలు పూర్తిగా తొలగిపోతాయి.
తరువాత వీటిని పన్నెండు గంటలపాటు నీటిలో నానబెట్టాలి. గింజలు మధ్యలో కొద్దిగా చీలినట్లు కనిపించాలి. అప్పుడే అవి బాగా నానినట్లు పరిగణించాలి. ఆపైన వీటిని మంచినీటితో రెండుసార్లు కడగాలి. లేదంటే మొలకలు త్వరగా కుళ్లిపోతాయి.
పెసలు, శనగల్లో ఉన్న నీటిని పూర్తిగా వంచేసి ఆపైన పలుచని గుడ్డలో పోసి మూటలా కట్టాలి. తరువాత దీన్ని ఒక గిన్నెలో ఉంచి పైన ఒక మూత పెట్టాలి. మూటకు గాలి ఆడేలా చూసుకోవాలి. ఈ గిన్నెను గది ఉష్ణోగ్రత వద్ద పొడిగా ఉండే ప్రదేశంలో ఉంచాలి.
పన్నెండు గంటల్లో పెసలు, శనగలకు చిన్న చిన్న మొలకలు వచ్చేస్తాయి. ఈ దశలో వీటిని మంచినీటితో జాగ్రత్తగా కడగాలి. వచ్చీరాని మొలకలతో ఉన్న గింజలను తినడం వల్ల కడుపునొప్పి, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా తినకూడదు.
వీటిని మరల అదే గుడ్డలో పోసి వదులుగా మూట కట్టి గిన్నెలో ఉంచితే మరో పన్నెండు గంటల్లో రెండంగుళాల వరకు మొలకలు పెరుగుతాయి. వీటిని మరోసారి మంచినీటితో కడిగి పలుచని తువాలు మీద పోసి పావుగంటసేపు ఆరనివ్వాలి. ఇలా పొడి పొడిగా ఆరిన మొలకలను బాక్సులోకి తీసి ఫ్రిజ్లో రెండు రోజులు నిల్వ చేసుకోవచ్చు.
ఇలా పరిపూర్ణంగా మొలకెత్తిన పెసలు, శనగలు తింటే త్వరగా జీర్ణమవుతాయి. వాటిలోని పోషకాలను శరీరం సులువుగా గ్రహించగల్గుతుంది. రోజూ మొలకలు తినే అలవాటు ఉన్నవారు స్ర్పౌట్ మేకర్ బాక్సులను వినియోగించుకోవచ్చు.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!