సివిల్స్ ర్యాంకర్స్ వాయిస్
ABN , Publish Date - Mar 09 , 2026 | 06:01 AM
అలుపన్నది తెలియదు. ప్రయత్నానికి విరామం ఇవ్వరు. ఓటమిని దరిచేరనివ్వరు. ఒక వేళ ఆ ప్రభావంతో కలత చెందినా కొంతసేపే. తమకు తామే సాంత్వన చెప్పుకొని, మళ్ళీ పోరాటానికి సన్నద్ధమవుతారు. వచ్చిన సర్వీ్సతో సరిపెట్టుకోరు...
అలుపన్నది తెలియదు. ప్రయత్నానికి విరామం ఇవ్వరు. ఓటమిని దరిచేరనివ్వరు. ఒక వేళ ఆ ప్రభావంతో కలత చెందినా కొంతసేపే. తమకు తామే సాంత్వన చెప్పుకొని, మళ్ళీ పోరాటానికి సన్నద్ధమవుతారు. వచ్చిన సర్వీ్సతో సరిపెట్టుకోరు. కోరుకున్న సర్వీస్ వచ్చే వరకు కృషి చేస్తూనే ఉంటారు. అపర విక్రమార్కులు, వారే సివిల్ సర్వీసెస్ విజేతలు. తప్పులను సవరించుకోవడం, నిలకడ సాధించడం, అంతిమ విజయానికి చేరువ కావడమే ఈ ప్రయాణంలో తాము తెలుసుకున్నదీ, పాటించిందీ అని సివిల్స్ విజేతలు చెబుతున్నారు. అమ్మ తమను సివిల్స్ వైపు ప్రోత్సహించిందని అంటున్న ఇద్దరు విజేతలు అసలు ఏమి చెబుతున్నారో చూద్దాం.
నిలకడతోనే సాధ్యమైంది
నిలకడ అంతకు మించి టెస్ట్ సిరీస్పై ముందు నుంచీ దృష్టి పెట్టడంతోనే నాకు ఈ ర్యాంక్ సాధ్యమైంది. ఆరో యత్నంలో ఈ ర్యాంకు సాధించాను. అయితే మొదటి సారి మినహా ప్రతి ప్రయత్నంలో ఏదో ఒక ర్యాంకు రావడంతో ఎన్నడూ నిస్పృహకు లోను కాలేదు.
మొదటిసారి నా ప్రయత్నం అంత సీరియ్సగా జరగలేదు. కాన్పూర్ ఐఐటీలో సీఎ్సఈ చదివిన నేను, కొద్ది కాలం శాంసంగ్లో పనిచేశాను. అలా చేస్తూ మొదటిసారి రాశాను. ఎంపిక కాలేదు. రెండో అటెం్ప్టలో ఇండియన్ పోస్టల్ సర్వీస్ వచ్చింది. మూడో యత్నంలో ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్, నాలుగోసారి ఇండియన్ పోలీస్ సర్వీ్సకు ఎంపికయ్యాను. అయిదో యత్నంలో ర్యాంకు వచ్చినప్పటికి మంచి సర్వీస్ రాలేదు. ఇప్పుడు ఆరో ప్రయత్నంలో నేను కలగన్న ఐఏఎ్సకు ఎంపికయ్యాను. అందువల్లే నేను ఎన్నడూ నిరాశపడ లేదు. ఓటమి ఎదురైన ప్రతిసారి చేసిన తప్పిదాలు గుర్తుకువచ్చేవి. వాటిని సవరించుకుని, మరింత మెరుగ్గా కష్టపడితే కోరుకున్న సర్వీసు వస్తుందన్న విశ్వాసం కలిగేది. అదే నన్ను ఇన్నాళ్ళూ ముందుకు నడిపింది.
నా ఆప్షనల్ సబ్జెక్టు కెమిస్ట్రీ. ఇంటర్లో నా సబ్జెక్టు. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్పై గట్టిపట్టు ఉంది. అంతకుమించి అందులో ఆసక్తి ఉంది. కాబోయే అధికారిగా కూడా నేను ప్రాబ్లమ్స్నే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అందుకే కెమిస్ట్రీని ఆప్షనల్ పేపర్గా ఎంచుకున్నాను. మెయిన్స్కు సంబంధించి ప్రిపరేషన్ ఒక ఎత్తు, పరీక్ష రోజున వాటిని కాగితంపై పెట్టడం మరొక ఎత్తు. నిజానికి మొత్తం సిలబ్సను కవర్ చేయాలి. అలాగని లోతుగా అవసరం లేదు. సిలబ్సలోని ప్రతి అంశం ముఖ్యమే. అడిగిన ప్రశ్నకు సంబంధించి అన్ని కోణాలను మన సమాధానంలో స్పృశించాలి. ఆ మేరకు అవగాహన ఉంటే సరిపోతుంది.
నాకు బుల్లెట్ పాయింట్స్తో సమాధానం రాయడమే ఇష్టం. అన్నింటినీ కవర్ చేశామా లేదా అన్నది సరిచూసుకునే వీలు ఉంటుంది. ఈ పద్ధతిలో వాల్యుయేటర్ని కూడా ఆకట్టుకోగలుగుతామని నేను బలంగా నమ్మతాను.
నన్ను సుజాత మేడమ్ బోర్డు ఇంటర్వ్యూ చేసింది. రెండో యత్నంలో ఎంపికైన పోస్టల్ సర్వీ్సపై ప్రశ్నలు అడిగారు. పోస్టల్ డిపార్ట్మెంట్కు వస్తున్న ఆర్థిక నష్టాలు - మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఖాకీ వెర్సస్ కలెక్టర్కు ఉన్న తేడాలు చెప్పమన్నారు. నాలుగో ప్రయత్నంలో ఐపీఎస్కు కావడమే అందుకు కారణం కావచ్చు. కాన్పూర్ ఐఐటీలో చదివి ఉండటంతో ఆ పట్టణంలో పరిశ్రమల ప్రస్తుత దుస్థితిపై కూడా అడిగారు. జియో పాలిటిక్స్, ఐపీఎల్ - బంగ్లాదేశ్ ఉదంతం తదితరాలపై ప్రశ్నించారు.
ఎక్కువ మంది సమగ్ర ప్రిపరేషన్ మంచిది అంటారు. నేను మాత్రం దేనికది ప్రిలిమ్స్ - మెయిన్స్ - పర్సనాలిటీ టెస్ట్కు ప్రిపేరయ్యాను. సివిల్స్ ప్రిపరేషన్లో నిలకడ, నిలదొక్కుకోవడం చాలా ముఖ్యం. రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు
డెడికేటెడ్గా చదవాలి. ఎప్పుడో పరీక్షల ముందు అని కాకుండా, సిలబస్ పూర్తికాగానే, మాక్ టెస్టులకు హాజరుకావాలి. వాటిని నిక్కచ్చిగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సీనియర్లతో మొదలుపెట్టినప్పటికీ, తదుపరి రోజుల్లో ఎవాల్యుయేషన్ మనకే తెలుస్తుంది. టెస్ట్ను పూర్తి చేసే హడావిడిలో ఏయే పాయింట్లు రాయలేకపోయామో, ఇంకెంత మెరుగ్గా రాయగలిగి కూడా చతికిలపడ్డామే మనకే అర్థమవుతుంది. సన్యా ఐఏఎస్ వంటి టెస్ట్ సిరీస్ నేను రాశాను.
మెయిన్స్ జరిగే ఆ రోజుల్లో చాలా ఒత్తిడి టైమ్ మేనేజ్మెంట్ కోణంలో ఉంటుంది. టెస్ట్ సిరీస్ రాస్తేనే ఆ విషయంలో సమయపాలన ఎలా అన్నది అర్థమవుతుంది. ఈ విషయంలో జాగ్రత్త పడకుంటే, మెయిన్స్ రాశాక బాధ పడాల్సి ఉంటుంది.
స్వవిషయానికి వస్తే నాన్న మాణిక్యాలరావు. అమ్మ నాగలక్ష్మి ప్రభుత్వ టీచర్. ఆమే నాకు స్ఫూర్తి. వారికి నేను ఒక్కడినే సంతానం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మా స్వస్థలం. అయితే కాకినాడలోని మా తాతగారింట్లోనే నేను పెరిగాను. అక్కడే చదువుకున్నాను. శాంసంగ్లో పనిచేస్తున్నప్పుడు సివిల్స్ ఆలోచన మొదలైంది. అయితే అంతకుముందే అమ్మ ప్రోత్సహించింది. అలా ఇటువైపు మళ్ళాను.
జీను శ్రీ జశ్వంత్ చంద్ర
ర్యాంక్ 23
సమగ్రత ముఖ్యం
ఎన్నాళ్ళు, రోజుకు ఎంతసేపు, మరెంత లోతుగా చదివామన్నది కాదు, విషయంపై సమగ్ర అవగాహన కలిగిందా లేదా అన్నది పాయింట్. మెయిన్స్ రాసేటప్పుడు కూడా సమగ్రతకే ప్రాధాన్యం ఇవ్వాలి. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివిన నేను మ్యాథమెటిక్స్ను ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నాను. నాలుగో ప్రయత్నంలో ఐఆర్ఎంఎస్కు ఎంపికయ్యాను. తాజాగా అయిదో యత్నంలో ఈ ర్యాంకు తెచ్చుకున్నాను. ఐఏఎస్ లేదంటే ఐపీఎ్సకు ఎంపికవుతానని అనుకుంటున్నాను.
సివిల్స్ రాయాలని అనుకున్న తరవాత సొంతంగా ప్రిపేరయ్యేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. చదవడానికే పరిమితం కాకుండా టెస్ట్ సిరీ్సకు హజరై, రాసిన వాటిని నిష్పక్షపాతం ఎవాల్యుయేట్ చేసుకునే వాడిని. మెయిన్స్లో మన రాసే సమాధానంలో సమగ్రత కనిపించాలి. ఉదాహరణకు వ్యవసాయం తీసుకుంటే అందులో ఒక్క రైతులే ఉండరు. ప్రజలు, ట్రేడర్లు, ప్రభుత్వ యంత్రాంగం, ఎఫ్సీఐ సహా చాలా మందికి, సంస్థలకు భాగస్వామ్యం ఉంటుంది. అందువల్ల వ్యవసాయంపై ప్రశ్నలు అడిగినప్పడు సంబంధిత ప్రతి కోణాన్ని తడుముతూ మనం జవాబు రాయగలగాలి.
లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా(రిటైర్డ్) కమిటీ నన్ను ఇంటర్వ్యూ చేసింది. బాంబే ఐఐటీ చదువుతున్నప్పుడు మా డిపార్ట్మెంట్ పత్రికకు ఎడిటర్గా వ్యవహరించేవాడిని. దాంతో ఎడిటర్ - రైటర్కు ఉన్న వ్యత్యాసం, ప్రస్తుత జర్నలిజమ్ తదితరాలపై అడిగారు. డీఎన్ఏకు సంబంధించి డబుల్-హెలిక్స్ స్ట్రక్చర్ గురించి ప్రశ్నించారు. ఫ్రాన్సిస్ క్రిక్తో కలిసి జేమ్స్ వాట్సన్ దీన్ని కనుగొన్నారు. అందుకుగాను వారిద్దరికీ 1962లో నోబెల్ బహుమతి లభించింది. వరంగల్ వాసిని కావడంలో సుబేదారి అంటే ఏమిటి అని అడిగారు. నా హాబీగా పేర్కొన్న మెడిటేషన్ గురించి ప్రశ్నించారు. అందులో నేను అనుసరించే లేదంటే పాటించే పద్ధతి గురించి వివరంగా చెప్పమన్నారు.
నిజానికి ఈ జర్నీ నాలో సమగ్రతను తెచ్చిపెట్టింది. నాన్న రవీందర్, అమ్మ అమరావతి - ఇద్దరూ ప్రభుత్వ టీచర్లు. నాకో తమ్ముడు రోషన్ ఉన్నాడు. తను ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. సివిల్స్ రాయాలని ప్రోత్సహించింది మాత్రం మా అమ్మ. సివిల్స్వైపు చూడు అని తనే నాకు తరచూ చెప్పేది.
అట్ల తరుణ్ తేజ
ర్యాంక్ 123
ఈ వార్తలూ చదవండి:
బొగ్గులా నల్లగా దోశ.. రెస్టారెంట్ ప్రయోగం వైరల్
కుటుంబంతో సహా వచ్చి గర్ల్ఫ్రెండ్ ఇంటి ముందు వ్యక్తి డ్యాన్స్! ఎందుకో తెలిస్తే..