కాంగ్రెస్ మహిళా ద్రోహి
ABN , Publish Date - Apr 19 , 2026 | 05:45 AM
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వీగిపోవడంతో కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా చేసిన కాంగ్రెస్...
ఆ పార్టీకి వారే గుణపాఠం చెబుతారు: కిరణ్ రిజిజు
ప్రతిపక్షాలది పెత్తందారి మనస్తత్వం: స్మృతి
న్యూఢిల్లీ ఏప్రిల్ 18: మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వీగిపోవడంతో కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా చేసిన కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు మహిళలకు తీరని ద్రోహం చేశాయని మండిపడుతోంది. కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేఖి అని మరోసారి రుజువైందని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. బిల్లును వీగిపోయేలా చేశారనే అంశం.. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఓ మచ్చలా ఉండిపోతుందని అన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే బిల్లుపై వారికి అభ్యంతరం ఏంటో ? అని రిజిజు ప్రశ్నించారు. మహిళలకు అన్యాయం చేసి సంబురాలు చేసుకుంటున్న ప్రతిపక్ష పార్టీలకు మహిళలే తగిన పాఠం చెబుతారని రిజిజు పేర్కొన్నారు. తాము మహిళలకు గౌరవం ఇవ్వాలనుకుంటే ప్రతిపక్షాలు అవమానించాయని రిజిజు దుయ్యబట్టారు. బిల్లు వీగిపోవడాన్ని తాము ఓటమిగా భావించడం లేదని, మహిళా సాధికారిత కోసం తాము కృషి చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ అంశంలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు వారి పెత్తందారి మనస్తత్వానికి (ఫ్యూడల్ మైండ్సెట్) నిదర్శనమని కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ దుయ్యబట్టారు. కాగా, మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందనే కారణంతో బీజేపీ మహిళా నేతలు, కార్యకర్తలు న్యూఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసానికి సమీపంలో శనివారం నిరసన ర్యాలీ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, బీజేపీ మహిళా ఎంపీలు హేమమాలిని, కమల్జీత్ షెరావత్, బన్సురీ స్వరాజ్, మంజు శర్మ, వాత్సల్య గుప్తా తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్
ఎల్ఓసీ రద్దు పిటిషన్పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్