కూతురి దారుణం.. జ్యోతిష్యుడు చెప్పాడని తల్లి హత్య
ABN , Publish Date - Feb 13 , 2026 | 10:25 AM
కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. జ్యోతిష్యుడు చెప్పాడని ఓ కూతురు ఘాతుకానికి ఒడిగట్టింది. కన్న తల్లిని అతి కిరాతకంగా హత్య చేసింది.
బెంగళూరు, ఫిబ్రవరి 13: జ్యోతిష్యుడు చెప్పాడని ఓ కూతురు దారుణానికి ఒడిగట్టింది. కన్న తల్లిని అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తుమ్కూరు జిల్లాకు చెందిన 55 ఏళ్ల పుష్పవతి అకస్మాత్తుగా చనిపోయింది. ఆమె కూతురు సుచిత్ర ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. పుష్పవతి మరణంపై గ్రామస్థులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అంత్యక్రియలు పూర్తికాకముందే గ్రామానికి చేరుకున్నారు.
సుచిత్రను విచారించగా అసలు విషయం బయటపడింది. తల్లిని తానే చంపేసినట్లు ఒప్పుకుంది. అసలు ఏం జరిగిందో చెప్పుకొచ్చింది. సుచిత్ర మాట్లాడుతూ.. ‘18 నెలల క్రితం మా నాన్న చనిపోయాడు. నాన్న మరణంపై నేను ఓ జ్యోతిష్యుడిని కలిశాను. మా అమ్మ క్షుద్రపూజలు చేసి మా నాన్నను చంపేసిందని ఆ జ్యోతిష్యుడు చెప్పాడు. నేను అతడి మాటలు నమ్మాను. మా అమ్మ మీద కక్ష పెంచుకున్నాను. అమ్మ నిద్రపోతున్న సమయంలో దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశాను. మా అమ్మది సహజ మరణం అని జనాలను నమ్మించడానికి ప్రయత్నించాను. వీలైనంత త్వరగా అంత్యక్రియలు చేయాలని చూశాను’ అని చెప్పింది.
పోలీసులు పుష్పవతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సుచిత్రను తప్పుదోవ పట్టించిన జ్యోతిష్యుడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు సుచిత్ర భర్తను విచారిస్తున్నారు. ఈ మర్డర్ ప్లాన్ గురించి సుచిత్ర భర్తకు ముందే తెలుసా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఇవి కూడా చదవండి
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం.. తారిఖ్ రెహ్మాన్కు పీఎం అభినందనలు