తేజస్ యుద్ధ విమానాలను తాత్కాలికంగా పక్కనపెట్టిన వాయుసేన
ABN , Publish Date - Feb 23 , 2026 | 11:29 AM
మరో తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వాయుసేన తేజస్ యుద్ధ విమానాలను తనిఖీల కోసం తాత్కాలికంగా పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: మరో తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. సాంకేతిక సమస్య కారణంగా ఈ నెల మొదటి వారంలో ప్రమాదం జరిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు భారతీయ వాయుసేన తేజస్ జెట్స్ను తాత్కాలికంగా పక్కనపెట్టినట్టు సమాచారం. తనిఖీల కోసం మొత్తం 30 సింగిల్ సీట్ జెట్స్ కార్యకలాపాలను నిలిపివేసినట్టు తెలుస్తోంది(IAF Grounds Tejas Aircrafts).
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ నెల మొదటి వారంలో ఒక కీలక వాయుసేన స్థావరంలో శిక్షణ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న సమయంలో తేజస్ జెట్కు ప్రమాదం జరిగిందని సమాచారం. అయితే, ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని సంబంధిత వర్గాలు ప్రాథమిక అంచనాకు వచ్చాయి. పూర్తిస్థాయి తనిఖీల కోసం తేజస్ జెట్స్ను నిలిపివేసినట్టు తెలిసింది.
తేజస్ యుద్ధ విమానాలను వాయుసేనలో ప్రవేశపెట్టిన తరువాత జరిగిన మూడో ప్రమాదం ఇదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2024లో జైసల్మేర్లో యుద్ధ విన్యాసాల సందర్భంగా మొదటి తేజస్ జెట్ క్రాష్ అయ్యింది. పైలట్ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక గతేడాది నవంబర్లో జరిగిన దుబాయ్ ఎయిర్షోలో మరో యుద్ధ విమానం కూలిపోగా పైలట్ కూడా మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలోనే మరో తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. ఇక ఈ వార్తలపై భారతీయ వాయుసేన స్పందించాల్సి ఉంది.
ఇవీ చదవండి:
అమెరికా ఆధ్వర్యంలోని కీలక కూటమిలో భారత్ చేరిక
భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్టు