Share News

భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్టు

ABN , Publish Date - Feb 22 , 2026 | 10:30 AM

ఢిల్లీ పోలీసులు తాజాగా భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. తమిళనాడులో ఆరుగురిని, పశ్చిమబెంగాల్‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు బంగ్లాదేశీయులని తెలిపారు.

భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్టు
Terror Module Busted by Delhi Police

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ పోలీసులు (Delhi Police) తాజాగా భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాక్ ఐఎస్ఐ‌తో పాటు బంగ్లాదేశ్ అతివాద సంస్థలతో సంబంధాలున్న 8 మందిని అరెస్టు చేశారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఏకకాలంలో పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భారత్‌లో భారీ ఉగ్రదాడికి వీళ్లు ప్లాన్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. విదేశీ హ్యాండ్లర్ల ఆధ్వర్యంలో భారత్‌లో వీళ్లు ఉగ్రకార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసులు ఆదివారం తెలిపారు (Terror Module Busted).

తమిళనాడులోని తిరుప్పుర్‌ జిల్లాలో మిజనూర్ రహమాన్, మొహమ్మద్ షబాత్, ఉమర్, మొహమ్మద్, లిటన్, మొహమ్మద్ షాహిద్, మొహమ్మద్ ఉజ్జల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరిని పశ్చిమబెంగాల్‌లో అరెస్టు చేశారు. నిందితుల్లో కొందరు బంగ్లాదేశీయులని పోలీసులు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా వారు నకిలీ ఆధార్ కార్డులను వినియోగించారని పేర్కొన్నారు.


నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద చర్యలకు సంబంధించి ఆన్‌లైన్ పోస్టులపై దర్యాప్తు జరుపుతుండగా నిందితుల గురించి తెలిసిందని పోలీసులు తెలిపారు. తమిళనాడులోని ఓ దుస్తుల ఫ్యాక్టరీలో ఈ ఆరుగురు పనిచేస్తున్నట్టు తెలిపారు.

పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కర్-ఏ-తయ్యబా భారత్‌లో దాడులను ప్లాన్ చేస్తున్నట్టు శనివారం నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వారు దాడులకు సిద్ధమైనట్టు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తాజాగా భారీ ఉగ్రకుట్రను భగ్నం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక తాజా ఉదంతంలో అరెస్టు చేసిన నిందుతులను విచారించేందుకు పోలీసులు వారిని ఢిల్లీకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్

ఉగ్ర ముప్పు.. ఢిల్లీలో హైఅలర్ట్..

Updated Date - Feb 22 , 2026 | 11:00 AM