Share News

ఉగ్ర ముప్పు.. ఢిల్లీలో హైఅలర్ట్..

ABN , Publish Date - Feb 21 , 2026 | 11:27 AM

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో దాడులకు పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా సిద్ధమైనట్టు నిఘావర్గాలు గుర్తించాయి. ఇస్లామాబాద్ దాడికి ప్రతీకారంగా ఎల్‌‌ఈటీ ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఉగ్ర ముప్పు.. ఢిల్లీలో హైఅలర్ట్..
Delhi terror alert

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో ఎర్రకోటతోపాటు దేశవ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్ర మూకలు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘావర్గాలు గుర్తించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(ఎల్‌‌ఈటీ) దాడులకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐఈడీ బాంబులతో దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫిబ్రవరి 6న పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా ఎల్ఈటీ ఈ దాడులను ప్లాన్ చేస్తోంది. ఇస్లామాబాద్ దాడిలో 31మంది మరణించగా.. 160 మంది గాయాలపాలయ్యారు. అయితే, ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది.


గతేడాది నవంబర్ 10న ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన కారుబాంబు దాడిలో 12 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇంతకు రెండింతల మంది గాయాలపాలయ్యారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ పేలుడు పదార్థాలున్న కారుతో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా అతడిని గుర్తించారు. అంతకుముందు, పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఏకంగా 2,900 కేజీల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని భారీ ఉగ్రకుట్రను ఆదిలోనే భగ్నం చేశారు. దీంతో, తమ ప్లాన్ గురించి పోలీసులకు తెలిసిందన్న కంగారులో ఉమర్ మొహమ్మద్ ఈ దాడికి పాల్పడి ఉంటాడని నిఘావర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు డా.ముజమ్మిల్ షకీల్, డా.అదిల్ రాథర్‌తోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.


ఈ వార్తలూ చదవండి

33 మంది బాలురపై అత్యాచారం చేసిన దంపతులకు మరణశిక్ష

ద్వైపాక్షిక చర్చలు.. సీఈఓలతో ప్రధాని మోదీ మంతనాలు

Updated Date - Feb 21 , 2026 | 12:49 PM