ద్వైపాక్షిక చర్చలు.. సీఈవోలతో మంతనాలు
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:33 AM
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 చివరి రోజు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. 16 ఆర్టిఫిషియల్ ..
ఏఐ సదస్సు సందర్భంగా ప్రధాని బిజీబిజీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 చివరి రోజు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. 16 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో అబ్రిడ్జ్, అదాలత్ ఏఐ, బ్రెయిన్సైట్ ఏఐ, క్రెడో ఏఐ, ఏకా కేర్, గ్లీన్, ఇన్నోగుల్, ఇన్విడియో, మికో, ఆరిజన్, ప్రొఫేజ్, రాసెన్, రుబ్రిక్, సత్సూర్, సూపర్నోవా, సైఫా ఐఏ కంపెనీల వ్యవస్థాపకులు, సీఈవోలు పాల్గొన్నారు. వ్యవసాయం, ఉన్నత విద్య తదితర రంగాల్లో ఏఐ వినియోగంపై ఈ సమావేశంలో చర్చించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రె్సతో సమావేశమై ఏఐ సద్వినియోగానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే, స్లొవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిన్, లీచెస్టైన్ యువరాజు అలోయిస్, మారిషస్ ప్రధాని నవీన్చంద్రలతో వేర్వేరుగా సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశాలన్నీ సుహృద్భావ వాతావరణంలో ఫలవంతంగా జరిగాయని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.