పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం ఉండాలి.. కేంద్రానికి సుప్రీం కోర్టు సూచన
ABN , Publish Date - Mar 17 , 2026 | 02:36 PM
పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం ఉండాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్రానికి సుప్రీంకోర్టు తాజాగా సూచించింది. పిల్లలు, వారి తల్లిదండ్రుల అవసరాలకు అనుగుణంగా సెలవులను నిర్ణయించాలని పేర్కొంది. మాతృత్వ సెలవులపై కేసులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు మంగళవారం పితృత్వ సెలవులపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
తండ్రులకు కూడా సెలవులు ఉండాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదని పేర్కొంది. తండ్రికి కూడా సమాన బాధ్యత ఉంటుందని తెలిపింది. మాతృత్వ సెలవుల తరహాలోనే.. వేతనంతో కూడిన పితృత్వ సెలవులు కల్పించాలని సూచించింది.
పని ప్రదేశాల్లో మహిళలపై వివక్ష తగ్గాలంటే ఇలాంటి చట్టాలు అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. పితృత్వ సెలవులు ప్రైవేట్ రంగంలోనూ అమలు చేసేలా నిబంధనలు రూపొందించాలని కేంద్రానికి సూచించింది. పిల్లల ఎదుగుదలలో తండ్రి పాత్రను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
ఇక మూడు నెలలలోపు వయసున్న పిల్లల్ని దత్తత తీసుకున్న మహిళలకు మాత్రమే 12 వారాల మాతృత్వ సెలవులను కేటాయించడం సరికాదని కూడా సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు సోషల్ సెక్యూరిటీ కోడ్-2020లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. దత్తత తీసుకున్న పిల్లల వయసుతో సంబంధం లేకుండా తల్లులకు 12 వారాల మాతృత్వ సెలవులు మంజూరు చేయాలని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
గుజరాత్ కాండ్లా పోర్టుకు వస్తున్న మరో రెండు నౌకలు
ఓరల్ సెక్స్తో గొంతు క్యాన్సర్!