Share News

జంతర్‌మంతర్-పార్లమెంటు ర్యాలీని విజయవంతం చేయండి: సోనమ్ వాంగ్‌చుక్

ABN , Publish Date - Jul 19 , 2026 | 01:41 PM

రేపు జంతర్‌మంతర్ నుంచి పార్లమెంటు వరకూ తలపెట్టిన ర్యాలీని విజయవంతం చేయాలని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఒక సందేశాన్ని విడుదల చేశారు.

జంతర్‌మంతర్-పార్లమెంటు ర్యాలీని విజయవంతం చేయండి: సోనమ్ వాంగ్‌చుక్
Sonum Wangchuk

ఇంటర్నెట్ డెస్క్: రేపు జంతర్‌మంతర్ నుంచి పార్లమెంటు వరకూ తలపెట్టిన ర్యాలీని విజయవంతం చేయాలని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఒక సందేశాన్ని విడుదల చేశారు. ఆమరణ దీక్ష చేస్తున్న ఆయనను నిన్న ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి ఆయన తన స్వదస్తూరితో రాసిన చీటీని రిలీజ్ చేశారు.

నీట్ పేపర్ లీక్ ఉదంతాలకు వ్యతిరేకంగా వాంగ్‌చుక్ ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. తన నిరసన కార్యక్రమాన్ని ఆయన రెండో స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణించారు. పేపర్ లిక్ వంటి అన్యాయాల నుంచి విముక్తి కావాలని తన సందేశంలో రాశారు. తన భార్య గీతాంజలి ద్వారా ఈ సందేశాన్ని పంపించినట్టు కూడా ఆయన పేర్కొన్నారు. పేపర్ లిక్ ఉదంతంపై జూన్ 28న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలో కూడా వాంగ్‌చుక్ పాల్గొన్నారు. అనంతరం, ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆయన దీక్ష ప్రారంభించి ఇప్పటికే 21 రోజులు పూర్తైంది. ఈ క్రమంలో వాంగ్‌చుక్ ఆరోగ్యం దృష్ట్యా పోలీసులు ఆయనను సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు.


ఇదిలా ఉంటే, తన భర్త వాంగ్‌చుక్‌ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గీతాంజలి తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తకు అందిస్తున్న చికిత్సలో పారదర్శకత లేదని ఆరోపించారు. తన పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు.. నలుగురి మృతి, ఐదుగురి గల్లంతు..

ఫేక్ ఓఎమ్ఆర్ షీట్స్ వద్దు.. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎన్‌టీఏ అలర్ట్

Updated Date - Jul 19 , 2026 | 02:42 PM