ఫేక్ ఓఎమ్ఆర్ షీట్స్ వద్దు.. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎన్టీఏ అలర్ట్
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:02 PM
నీట్ యూజీ 2026 అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా కీలక సూచన చేసింది. మార్కుల్లో తేడాలపై ఫిర్యాదులు చేసేటప్పుడు ఏఐతో చేసిన ఫేక్ ఓఎమ్ఆర్ షీట్స్ను దాఖలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: నీట్ యూజీ 2026 అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా కీలక సూచన చేసింది. మార్కుల్లో తేడాలపై ఫిర్యాదులు చేసేటప్పుడు ఏఐతో చేసిన ఫేక్ ఓఎమ్ఆర్ షీట్స్ను దాఖలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. అధికారికంగా డౌన్లోడ్ చేసుకున్న ఓఎమ్ఆర్ షీట్స్ కాపీలనే సమర్పించాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. మార్కుల్లో తేడాలపై ఫిర్యాదు చేసే సమయంలో దాఖలు చేసిన కొన్ని ఓఎమ్ఆర్ షీట్స్ ఏఐతో తయారు చేసినవన్న అనుమానాలు రావడంతో ఎన్టీఏ ఎక్స్ వేదికగా ఈ హెచ్చరిక చేసింది.
నీట్ యూజీ 2026 ఫలితాలకు సంబంధించిన వచ్చిన ప్రతి ఒక్క ఫిర్యాదును నిశితంగా గమనిస్తున్నామని ఎన్టీఏ ఎక్స్ వేదికగా పేర్కొంది. తాము ఆశించిన స్కోరుకు, వచ్చిన మార్కులకు వ్యత్యాసం ఉందని భావిస్తున్న విద్యార్థులు అధీకృత ఓఎమ్ఆర్ రెస్పాన్స్ షీట్స్ కాపీలను డౌన్లోడ్ చేసుకుని తమ ఫిర్యాదులకు జత చేయాలని తెలిపింది.
నీట్ యూజీ 2026 రీటెస్టు ఫిలితాలు జులై 16న విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్, ఇతర సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు మొత్తం 11.21 లక్షల మంది అర్హత సాధించారు. అయితే, తాము ఆశించిన స్కోరుకు భిన్నంగా మార్కులు వచ్చాయని ఫలితాలు వెలువడ్డ తరువాత కొందరు విద్యార్థులు పేర్కొన్నారు. ఫైనల్ ఆన్సర్ కీ ద్వారా లెక్కించుకున్న మార్కులకు ఓఎమ్ఆర్ రెస్పాన్స్ షీట్స్ మార్కులకు తేడా ఉందని చెప్పారు. పలువురు ఫిర్యాదులు చేశారు. అన్నింటినీ పరిశీలిస్తున్నట్టు ఎన్టీఏ తాజాగా పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
అయోధ్య విరాళాల వివాదం.. కేంద్రానికి ఖర్గే, రాహుల్ లేఖ
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో..