నెలకు ఒక రాకెట్ ప్రయోగం.. అదే మా లక్ష్యం: స్కైరూట్ సీఈఓ
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:56 PM
నెలకో రాకెట్ ప్రయోగం చేసేలా కార్యకలాపాలను విస్తరించడమే తమ లక్ష్యమని స్కైరూట్ సంస్థ సీఈఓ పవన్ కుమార్ తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: నెలకు ఒక రాకెట్ ప్రయోగం చేసేలా కార్యకలాపాలను విస్తరించడమే తమ లక్ష్యమని స్కైరూట్ సంస్థ సీఈఓ పవన్ కుమార్ తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఎరోస్పేస్ రంగ సంస్థ స్కైరూట్ శనివారం చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. శాటిలైట్ ప్రయోగాలకు అనువైన రాకెట్ను దిగ్విజయంగా ప్రయోగించిన తొలి భారతీయ ప్రైవేటు సంస్థగా నిలిచింది.
ఈ నేపథ్యంలో తమ కార్యకలాపాల విస్తరణపై సంస్థ సీఈఓ పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఏడాదే రెండో రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది మరిన్ని ప్రయోగాలు ఉంటాయని అన్నారు. అంతిమంగా నెలకు ఒక రాకెట్ ప్రయోగం చేపట్టే స్థాయికి కార్యక్రమాలను విస్తరించడమే తమ లక్ష్యమని చెప్పారు. విక్రమ్-1 కంటే మూడు రెట్లు అధిక సామర్థ్యం కలిగిన విక్రమ్-2 రాకెట్ ప్రయోగానికి కూడా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.
స్కైరూట్ విజయంతో భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాకెట్ ప్రయోగాలు నిర్వహించే ప్రైవేటు సంస్థలున్న దేశంగా అమెరికా, చైనా తరువాతి స్థానాన్ని భారత్ దక్కించుకుంది. ఇప్పటివరకూ భారత్లో ఆర్బిటాల్ లాంచింగ్ ప్రయోగాలన్నీ ఇస్రో నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా స్కైరూట్ను ప్రధాని మోదీ అభినందించారు. ఇక చిన్న తరహా శాటిలైట్స్ను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు విక్రమ్-1 అత్యంత అనువైనదని స్కైరూట్ సంస్థ పేర్కొంది. తమ సంస్థ చిన్న శాటిలైట్ల ప్రయోగాల కోసం ఉద్దేశించిన క్యాబ్ సర్వీస్ లాంటిదని సంస్థ సీఈఓ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
జమ్మూకశ్మీర్లో భారీ వర్షాలు.. నలుగురి మృతి, ఐదుగురి గల్లంతు..
ఫేక్ ఓఎమ్ఆర్ షీట్స్ వద్దు.. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎన్టీఏ అలర్ట్