ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు!
ABN , Publish Date - Aug 18 , 2026 | 10:15 PM
ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ను రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ను రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల ఆధునికీకరణకు సంబంధించిన టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సత్యేందర్ జైన్తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన వారిలో ఢిల్లీ జల్ బోర్డు సీఈఓ, ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్, మాజీ కన్సల్టెంట్ అంకిత్ శ్రీవాత్సవ, ఏఎన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రొప్రైటర్ నాగేంద్ర యాదవ్, యూరోటెక్ ఎన్విరాన్మెంట్ సంస్థ యజమాని రాజ్ కుమార్ కుర్రా, శ్రీజనహార్ సంస్థ ప్రొప్రైటర్ పంకజ్ వర్మ ఉన్నారు. ఢిల్లీలోని మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల అప్గ్రేడేషన్కు సంబంధించి టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 2024లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తులను అధికారులు తాజాగా అరెస్టు చేశారు.
సత్యేందర్ జైన్ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. రాజకీయ దురుద్దేశాలతో ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించింది. గతంలో మనీలాండరింగ్ ఆరోపణలతో తప్పుడు కేసు పెట్టి సత్యేందర్ జైన్ను అరెస్టు చేశారని చెప్పింది. ఇప్పుడు మళ్లీ అరెస్టు చేసి వేధిస్తున్నారని ఆరోపించింది. తప్పుడు ఆరోపణలు, జైలు శిక్షలతో రాజకీయ ప్రత్యర్థులను బీజేపీ టార్గెట్ చేస్తోందని ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ నియంతృత్వం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని ప్రశ్నించారు. తాజా ఉదంతం కూడా భవిష్యత్తులో తప్పుడు కేసుగా తెలుతుందని చెప్పారు. జైలు పాలై, మానసిక వేదన అనుభవించిన వారికి పరిహారం ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు.
ఈ వార్తలనూ చదవండి:
విద్యార్థుల నిరసనల్లో ఏకే-47తో కాల్పులు.. జిల్లా ఎస్పీ బదిలీ
యమధర్మరాజు రెస్ట్లో ఉన్నట్లున్నాడు.. కొద్దిలో తప్పించుకున్నాడు..!