Share News

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.7.4 కోట్ల నకిలీ నోట్లు!

ABN , Publish Date - Sep 02 , 2026 | 06:48 AM

బ్యాంకు లెక్కల్లో రూ.4.36లక్షలు తేడా వచ్చిందని దర్యాప్తు చేస్తే రూ.7.4కోట్ల విలువైన నకిలీ నోట్ల మోసం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ఉన్న...

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.7.4 కోట్ల నకిలీ నోట్లు!

రూ.4.36 లక్షల తేడా.. తనిఖీల్లో మోసం బయటకు

యూపీలోని సహారన్‌పూర్‌ బ్యాంకులో భారీ స్కామ్‌

కరెన్సీ చెస్ట్‌లో అసలు నోట్లను తీసుకువెళ్లి నకిలీ నోట్లు పెట్టిన దుండగులు

బ్యాంకు అధికారులపైనే అనుమానం.. కేసు నమోదు

సహారన్‌పూర్‌, సెప్టెంబరు 1: బ్యాంకు లెక్కల్లో రూ.4.36లక్షలు తేడా వచ్చిందని దర్యాప్తు చేస్తే రూ.7.4కోట్ల విలువైన నకిలీ నోట్ల మోసం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) కరెన్సీ చెస్ట్‌(నగదు నిల్వ కేంద్రం)లో ఈ భారీ మోసం జరిగింది. ఆగస్టు 10న ఈ నగదు నిల్వ కేంద్రం నుంచి పీఎన్‌బీ అధికారులు ఆర్బీఐకి కొంత నగదును పంపించారు. అందులో రూ.4.6లక్షలు తక్కువ వచ్చింది. దీంతో, ఆర్బీఐ ఆడిట్‌కు ఆదేశించింది. అధికారులు సహారన్‌పూర్‌లోని కరెన్సీ చెస్ట్‌లో తనిఖీలు చేయగా అక్కడ రూ.7.4కోట్ల విలువైన నకిలీ నోట్లు బయటపడ్డాయి. అంటే, ఎవరో నకిలీ నోట్లను అక్కడ పెట్టి, అసలైన నోట్లను తీసుకువెళ్లారన్న మాట. ఈ వ్యవహారంలో ఇక్కడి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ రవి కుమార్‌, కరెన్సీ చెస్ట్‌ మేనేజర్లు సుశీల్‌ శర్మ, అమిత్‌ కుమార్‌లతో పాటు మరికొందరిని అనుమానితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. కరెన్సీ చెస్ట్‌ అంటే.. ఆర్బీఐ ఎంపిక చేసిన కొన్ని బ్యాంకు శాఖల్లో ఏర్పాటు చేసే ప్రత్యేకమైన నగదు నిల్వల గది. ప్రధాన నగరాల్లో బ్యాంకుల పర్యవేక్షణలో కరెన్సీ చెస్ట్‌లను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి సమీప బ్యాంకులకు, ఏటీఎంలకు నగదు వెళ్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Updated Date - Sep 02 , 2026 | 06:48 AM