తప్పు ఎన్టీఏది.. శిక్ష విద్యార్థులకా?: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Aug 17 , 2026 | 01:27 PM
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీరుపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజీసీ-నెట్ పరీక్షలో సోషియాలజీ, ఇంగ్లిష్, కామర్స్ పరీక్షలను రద్దు చేసి సెప్టెంబర్లో..
న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీరుపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజీసీ-నెట్ పరీక్షలో సోషియాలజీ, ఇంగ్లిష్, కామర్స్ పరీక్షలను రద్దు చేసి సెప్టెంబర్లో మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించడంపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఎన్టీఏ తప్పులకు వేలాది మంది విద్యార్థులు మూల్యం చెల్లించాల్సి వస్తోందని విమర్శించారు.
ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ.. ‘మోదీజీ.. మీ ఎన్టీఏ ఏం చేసిందో చూడండి. జూన్ 22 నుంచి 30 వరకు సోషియాలజీ, ఇంగ్లిష్, కామర్స్ యూజీసీ-నెట్ పరీక్షలు జరిగాయి. దాదాపు రెండు నెలల తర్వాత ప్రశ్నపత్రాల్లో లోపాలు, గత ప్రశ్నల పునరావృతం కారణంగా ఈ మూడు పరీక్షలను ఎన్టీఏ రద్దు చేసింది. ఎన్టీఏ నిర్ణయం వల్ల ఏళ్ల తరబడి పరీక్షకు సిద్ధమైన వేలాది మంది అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, ఫీజులు చెల్లించడం, దూర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు ప్రయాణించాల్సి వస్తోంది. తప్పు చేసింది ఎన్టీఏ.. కానీ, శిక్ష అనుభవించేది మాత్రం విద్యార్థులా?’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్స్ట్రాక్షన్ మెషీన్..
పరీక్షా వ్యవస్థ విద్యార్థులను దోపిడీ చేసే వ్యవస్థగా మారిందని రాహుల్ ఆరోపించారు. దేశంలో సరైన పరీక్షా వ్యవస్థ లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను కోటా, డెహ్రాడూన్, ప్రయాగ్రాజ్లలో ఇదే విషయాన్ని ప్రస్తావించానన్నారు. ‘ఇది విద్యా వ్యవస్థ కాదు.. డబ్బు, కాలం, మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని తీసుకుని చివరికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని వ్యవస్థగా మారింది’ అని రాహుల్ విమర్శలు గుప్పించారు.
ప్రశ్నపత్రాలు ముందే లీకయ్యాయా?
యూజీసీ-నెట్ ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే లీకయ్యాయా? అని రాహుల్ గాంధీ సందేహం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు ఎన్టీఏ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారాయన.
ఎన్టీఏపై చర్యలకు రాహుల్ గాంధీ డిమాండ్..
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మొదటి అడుగు మాత్రమేనన్న రాహుల్ గాంధీ.. ఎన్టీఏ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నిస్తూనే ఉంటా: రాహుల్ గాంధీ
‘సెప్టెంబర్లో మళ్లీ పరీక్ష రాయనున్న ప్రతి విద్యార్థికి చెబుతున్నా.. మీరు సమస్య కాదు. పరీక్షను నిర్వహించలేని వ్యవస్థను ప్రధాని మోదీ ప్రభుత్వం నిర్మించింది. ఆ వ్యవస్థ చేసిన తప్పులకు ఇప్పుడు విద్యార్థులనే బాధ్యులుగా చేస్తోంది. మీ విలువైన సంవత్సరాలు వృథా అవుతున్నాయి. దీనిపై మోదీ సమాధానం చెప్పే వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని రాహుల్ గాంధీ అన్నారు.