ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా నిరసన గళం..
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:59 PM
ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా తన పట్ల పార్టీ ప్రదర్శిస్తోన్న వైఖరిని తప్పుబట్టారు. నా నోరు నొక్కినంత మాత్రాన, మీరు గెలిచినట్టుకాదంటూ సొంతపార్టీకి సూచించారు. ఇలాంటి ప్రయత్నాలతో తన గళాన్ని అణచివేయగలరేమో గానీ.. ఓడించలేరన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఆమ్ ఆద్మీ పార్టీలో (AAP)విభేదాలు రోడ్డెక్కాయి. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా తాజాగా విడుదల చేసిన వీడియో సందేశం హాట్ టాపిక్ అయింది. రాజ్యసభలో తమ పార్టీకి కేటాయించిన సమయంలో తనను మాట్లాడకుండా అడ్డుకోవాలని ఆప్ నాయకత్వమే ప్రయత్నిస్తోందన్నారు. దీని కోసమే రాజ్యసభ సెక్రటేరియట్కు అధికారికంగా లేఖ రాసిందని కూడా ఆయన వెల్లడించారు.
'నా నోరు నొక్కినంత మాత్రాన, మీరు గెలిచినట్టుకాదు' అంటూ సొంత పార్టీకి రాఘవ్ సూచించారు. ఇలాంటి ప్రయత్నాలతో తన గళాన్ని అణచివేయగలరేమో గానీ.. ఓడించలేరన్నారు. పార్లమెంట్లో తాను సామాన్యుడి గొంతుకగా నిలిచినందుకే తనపై ఈ ఆంక్షలు విధించారని రాఘవ్ పేర్కొన్నారు. తనను అణచివేయాలని చూస్తే ఊరుకోనని హెచ్చరిస్తూ, 'నన్ను శాంతంగా ఉన్న నది అనుకోవద్దు.. సమయం వస్తే వరదలా మారతాను' అని పార్టీ నాయకత్వానికి సవాల్ విసిరారు.
రాఘవ్ తీరుపై ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, సహా పలువురు తీవ్రంగా స్పందించారు. కేజ్రీవాల్ కష్టాల్లో ఉన్నప్పుడు రాఘవ్ చడ్డా లండన్లో ఉండి తప్పించుకున్నారని ఆరోపించారు. బీజేపీకి భయపడి ఆయన కేవలం 'సాఫ్ట్' ఇష్యూస్ (ఎయిర్పోర్ట్ ఫుడ్ వంటివి) మీద మాట్లాడుతున్నారని, అసలైన రాజకీయ పోరాటం చేయడం లేదని విమర్శించారు. ఇలా ఉండగా, పార్టీ ఆయన్ని రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ను నియమించిన సంగతి తెలిసిందే. ఇదే ప్రస్తుత పరిణామాలకు తక్షణ కారణమైంది.