2029లో జమిలి ఖాయమే!
ABN , Publish Date - Jul 11 , 2026 | 06:20 AM
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ 2029లో కచ్చితంగా సాకారమవుతుందని పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) చీఫ్, కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌధరి ఆశాభావం...
రాజ్యాంగ నిపుణులతో చర్చలు.. ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ బిల్లుకు 99ు మంది మద్దతు
కొందరు సీఎంలు, పార్టీలు అంగీకరిస్తే 2029కే కొన్ని రాష్ట్రాల ఎన్నికలు
జేపీసీ సారథి పీపీ చౌధరి వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 10: లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ 2029లో కచ్చితంగా సాకారమవుతుందని పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) చీఫ్, కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌధరి ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ బిల్లు(129వ రాజ్యాంగ సవరణ బిల్లు)పై శుక్రవారం గోవా సీఎం ప్రమోద్ సావంత్, మంత్రివర్గంతో చర్చల కోసం గోవాలో జేపీసీ సమావేశమైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ అవకాశాలు, ఆలోచనలపై అధ్యయనం చేస్తున్నామని.. అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన విధానం రూపకల్పనకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఒకేసారి ఎన్నికలకు పార్టీలు, కొందరు సీఎంలు స్వచ్ఛందంగా అంగీకరిస్తే కొన్ని రాష్ట్రాల ఎన్నికలను ముందుగానే.. అంటే 2029లో నిర్వహించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. జమిలి ఎన్నికలను ఎలా నిర్వహిస్తే బాగుంటుంది.. ఎదురయ్యే సవాళ్లు ఏమిటి.. వాటిని ఎలా పరిష్కరించాలో గోవా ముఖ్యమంత్రి అభిప్రాయాలు తెలుసుకున్నామని తెలిపారు. జేపీసీ ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఢిల్లీల్లో పర్యటించిందని.. రాజ్యాంగ నిపుణులు, విద్యావేత్తలు, పౌరసమాజం సంస్థలు తదితరులను కలిసిందని చెప్పారు. వీరిలో దరిదాపుగా 99 శాతం మంది జమిలి ఎన్నికల ప్రతిపాదనను సమర్థించారని.. ప్రస్తుతం అన్ని పార్టీలకూ ఆమోదయోగ్యమైన వ్యవస్థ కోసం కృషి చేస్తున్నామని ఉద్ఘాటించారు. తదుపరి లోక్సభ ఎన్నికలు జరిగే 2029నాటికి ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’ కార్యరూపం దాలుస్తుందన్న సంకేతాలు అందుతున్నాయని తెలిపారు. ‘జమిలి ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించిన ఆర్థిక కోణాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీకి నివేదించాం.
దేశవ్యాప్తంగా విడివిడిగా ఎన్నికల నిర్వహణ వల్ల సుమారు రూ.7 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఒకేసారి ఎన్నికలు జరిపితే ఖజానాకు ప్రయోజనం కలుగుతుంది. ఎన్నికలు దేశంలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. దీని ప్రభావం ఇతర రాష్ట్రాల ఎకానమీపైనా పడుతోంది. ఉదాహరణకు.. ఏదైనా పెద్ద రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతుంటే గోవాకు పర్యాటకుల రాక ఆగిపోతోంది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు గ్లోబలైజ్ అయింది. తరచూ ఎన్నికలతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యాబోధనపై ప్రభావం పడుతోంది. ఆర్థికంగా బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలపైనే ఆధారపడి ఉన్నారు’ అని వివరించారు. జమిలి ఎన్నికలు ప్రధాని మోదీ ప్రతిపాదించిన ప్రధాన ఎన్నికల సంస్కరణగా చౌధరి అభివర్ణించారు. 2047నాటికి భారత్ అభివృద్ధి చెందాలన్న లక్ష్యానికి ఇది తోడ్పడుతుందన్నారు. విస్తృత ఏకాభిప్రాయ సాధన, అందరికీ ఆమోదయోగ్యమైన ఆచరణీయ విధాన రూపకల్పనే జేపీసీ లక్ష్యమని తెలిపారు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్