ఇథనాల్పై నెపం పెట్టొద్దు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ABN , Publish Date - Jul 14 , 2026 | 08:08 PM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇథనాల్ బ్లెండెడ్ ఇంధన (ఈ20) విధానాన్ని రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సమర్థించుకున్నారు. వాహనంలో లోపం తలెత్తిన ప్రతిసారీ ఈ20 ఇంధనం కారణమని భావించడం తగదని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇథనాల్ బ్లెండెడ్ ఇంధన (ఈ20) విధానాన్ని రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సమర్థించుకున్నారు. వాహనంలో లోపం తలెత్తిన ప్రతిసారీ ఈ20 ఇంధనం కారణమని భావించడం తగదని చెప్పారు. ఈ20 పెట్రోల్ విషయంలో ప్రముఖ యూట్యూబర్, వ్లాగర్ సౌరవ్ జోషీ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్న నేపథ్యంలో మంత్రి గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ20 పెట్రోల్తో తన బెన్జ్ కారు మైలేజీ తగ్గిందని సౌరవ్ జోషీ అంతకుముందు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇది నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో మెర్సిడీజ్ బెన్జ్ ఇండియా సంస్థ వివరణ ఇచ్చింది. భారత్లో తాము బీఎస్ 6 ప్రమాణాల ప్రకారం రూపొందించిన వాహనాలను విక్రయిస్తున్నామని తెలిపింది. ఇవి ఈ20 పెట్రోల్కు అనుకూలమైనవని తెలిపింది. దీంతో, జోషీ తన కామెంట్స్ను వెనక్కు తీసుకున్నాడు.
ఈ ఉదంతంపై మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం స్పందిస్తూ పర్యావరణహిత ప్రత్యామ్నాయ ఇంధనాల విషయంలో భారత్ మొదటి నుంచీ పారదర్శక విధానాన్ని అనుసరిస్తోందని అన్నారు. ‘ప్రజలకు వాస్తవాలు అన్నీ తెలుసు. పర్యావరణహిత ఇంధనాల వినియోగం పెంచే విషయంలో ప్రణాళిక వివరాలను ప్రతి దశలో ప్రజలతో పంచుకుంటూనే ఉన్నాము’ అని అన్నారు. ఇంధన రంగంలో స్వావలంబన సాధించడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇంధన భద్రతే గల్ఫ్ దేశాలతో జరిగిన చర్చల్లోని కీలకాంశం.. విదేశాంగ మంత్రిత్వ శాఖ
వెట్టిచాకిరీతో తయారు చేసిన ఉత్పత్తులపై భారత్ నిషేధం!