త్వరలో సీబీటీ విధానంలో నీట్-యూజీ పరీక్ష!
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:52 AM
పేపర్ లీకేజీతో దేశవ్యాప్తంగా సంచలనమైన నీట్-యూజీ పరీక్షా విధానంలో ప్రక్షాళన దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: పేపర్ లీకేజీతో దేశవ్యాప్తంగా సంచలనమైన నీట్-యూజీ పరీక్షా విధానంలో ప్రక్షాళన దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ వైద్య విద్య ప్రవేశ పరీక్షను సాంప్రదాయ రాతపరీక్ష (పెన్ అండ్ పేపర్) విధానం నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షా (సీబీటీ) విధానానికి మార్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీయే) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ వెల్లడించారు. ఈ ప్రతిపాదిత మార్పునకు సంబంధించిన ప్రణాళికపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకణి నేతృత్వంలోని హైపవర్డ్ టాస్క్ఫోర్స్ పనిచేస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన ప్రధాన కార్యాలయాన్ని దక్షిణ ఢిల్లీలోని ఓఖ్లా నుంచి సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్లో ఉన్న భారత ప్రభుత్వ ప్రెస్ బిల్డింగ్ ఐదో అంతస్తుకు మార్చింది. ఎన్టీఏ తన పరీక్షల విధానంలో సంస్కరణలు, భద్రతా చర్యలు చేపడుతున్న క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.