ఎన్నికల్లో ఓటమి.. రీకౌంటింగ్ను కోరుతూ హైకోర్టులో స్టాలిన్ పిటిషన్
ABN , Publish Date - Aug 24 , 2026 | 06:29 PM
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కొళత్తూర్ నియోజకవర్గం ఫలితానికి సంబంధించి రికౌంటింగ్ నిర్వహించాలని కోర్టును కోరారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కొళత్తూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమి చవి చూసిన ఆయన ఓటింగ్ మెషీన్లు, వీవీప్యాట్ ప్రక్రియలకు సంబంధించి లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. రీకౌంటింగ్కు ఆదేశించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు ఎన్నికను రద్దు చేయాలని కోరారు. తనను విజేతగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
తనకు కంచుకోటగా ఉన్న కొళత్తూర్లో స్టాలిన్ అంతకుముందు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ 2026లో మాత్రం అనూహ్యంగా ఓటమి చవిచూశారు. టీవీకే అభ్యర్థి, సీనియర్ నేత వీఎస్ బాబు 8,795 ఓట్ల తేడాతో స్టాలిన్పై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బాబుకు 82,997 ఓట్లు పోలవగా, స్టాలిన్కు 74,202 ఓట్లు వచ్చాయి.
అయితే, డీఎంకే సారథ్యంలోని కూటమికి తమిళ ప్రజల నుంచి మద్దతు దక్కిందని ఫలితాల విడుదల అనంతరం స్టాలిన్ పేర్కొన్నారు. అధికార పార్టీకి, డీఎంకే కూటమికి మధ్య కేవలం 3.52 శాతం ఓట్ల అంతరమే ఉందని చెప్పారు. అయితే, ప్రజలు మార్పు కోరుకోవడంతోనే తాను విజయం సాధించానని బాబు తెలిపారు. స్థానికులెవరూ స్టాలిన్కు తెలియదని అన్నారు. ఆయన సీఎం అయినా ఎమ్మెల్యే అయినా ముందుగా నియోజకవర్గ ప్రజలతో మమేకం కావాలని సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
న్యూఢిల్లీ - పాట్నా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు లేకుండా.. దేశాభివృద్ధి ఎలా సాధ్యం: అభిజీత్ దీప్కే