సరదాకు అర్థమే తెలియదు!
ABN , Publish Date - Jan 26 , 2026 | 05:15 AM
భారతదేశంలో జన్మించి ఆదివారం కన్నుమూసిన బ్రిటిష్ జర్నలిస్టు, బీబీసీ మాజీ బ్యూరో చీఫ్ సర్ విలియం మార్క్ టులీ (90) దాదాపు ఏడు దశాబ్దాలపాటు భారత రాజకీయాలను సమర్థంగా విశ్లేషించారు.
పరిపాలన ఆధునికీకరణలో చంద్రబాబు కృషి భేష్
ఆయన వినూత్న సంస్కరణలను రికార్డు చేసిన మార్క్ టులీ
న్యూఢిల్లీ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): భారతదేశంలో జన్మించి ఆదివారం కన్నుమూసిన బ్రిటిష్ జర్నలిస్టు, బీబీసీ మాజీ బ్యూరో చీఫ్ సర్ విలియం మార్క్ టులీ (90) దాదాపు ఏడు దశాబ్దాలపాటు భారత రాజకీయాలను సమర్థంగా విశ్లేషించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనా ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్ను టెక్నాలజీ కేంద్రంగా మార్చేందుకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా రికార్డు చేశారు. సరదా అన్న పదానికి అర్థమే తెలియని చంద్రబాబు.. అనుక్షణం కష్టపడి పనిచేస్తారని.. సొంత పార్టీ, అధికార యంత్రాంగంపై ఆయనకు పూర్తి పట్టుందని విశ్లేషించారు. చంద్రబాబు ఈ-గవర్నెన్స్ను ప్రారంభించిన కాలంలో టులీ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. చంద్రబాబుతో ఒక రోజంతా గడిపారు. ‘ఇండియా ఇన్ స్లో మోషన్’ అనే పుస్తకంలో ‘సైబరాబాద్ సృష్టి’పై ప్రత్యేక అధ్యాయాన్ని పొందుపరిచారు. హైదరాబాద్ను ప్రధాన ఐటీ నగరంగా మార్చేందుకు, పరిపాలన ఆధునికీకరణ, వినూత్న సంస్కరణలు, వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పరిచేందుకు చంద్రబాబు చేసిన కృషిని తొలిరోజుల్లో రికార్డు చేసిన ఘనత టులీకే దక్కింది. అయితే ఎంతవేగంగా సంస్కరణలు అమలు చేయాలనుకున్నా అధికార యంత్రాంగం మందకొడి వైఖరివల్ల చంద్రబాబు విజయం సాధించలేకపోయారని అభిప్రాయపడ్డారు.