దారుణ ఘటన.. దొంగతనం చేశాడన్న అనుమానంతో..
ABN , Publish Date - Jun 11 , 2026 | 01:35 PM
పంజాబ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేశాడన్న అనుమానంతో జనం ఓ వ్యక్తిని చావగొట్టారు. చేతులు, కాళ్లు కట్టేసి.. గుండు కొట్టించి అత్యంత పాశవికంగా ప్రవర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేశాడన్న అనుమానంతో జనం ఓ వ్యక్తిని చావగొట్టారు. చేతులు, కాళ్లు కట్టేసి.. గుండు కొట్టించి అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రెండు రోజుల క్రితం లుధియానాలో ఓ వ్యక్తిని దొంగతనం చేశాడన్న అనుమానంతో జనం పట్టుకున్నారు. విచక్షణా రహితంగా అతడిపై దాడి చేశారు. అనంతరం స్థానిక బ్యాంకు ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. అతడిని ఓ స్తంభానికి కట్టేశారు. తర్వాత గుండు కొట్టించారు. కనుబొమ్మలు కూడా తొలగించారు.
అతడి చేతిలో హిందీ, పంజాబీలో ‘నేను దొంగను’ అని రాసిన ప్లకార్డులు పెట్టారు. ఈ దారుణాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. పోలీసులు జూన్ 10వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డిజిటల్ ఫోరెన్సిక్ టూల్స్ సాయంతో వీడియోలో ఉన్న నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. తప్పు జరిగినప్పుడు జనం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని అన్నారు.
ఇవి కూడా చదవండి
వన్డే ర్యాంకింగ్స్లో నెం.1గా టీమిండియా..
సీబీఎస్ఈ లోపాలు ఎత్తిచూపిన యువకుడికి ఐఐటీ కాన్పుర్లో జాక్పాట్