నల్లకోటులో కోర్టుకు మమత
ABN , Publish Date - May 15 , 2026 | 04:05 AM
బెంగాల్ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల విషయంలో పోలీసులపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ సీఎం మమతాబెనర్జీ విరుచుకుపడ్డారు.
ఎన్నికల ఫలితాల అనంతర హింసపై కలకత్తా హైకోర్టులో స్వయంగా వాదనలు
కోల్కతా, మే 14: బెంగాల్ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల విషయంలో పోలీసులపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ సీఎం మమతాబెనర్జీ విరుచుకుపడ్డారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి నల్లకోటులో హైకోర్టుకు వచ్చిన ఆమె ఈ ఘటనలపై తన పార్టీ నమో దు చేసిన కేసుల్లో స్వయంగా వాదనలు వినిపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాలు తగలబడుతున్నా, పార్టీ కార్యకర్తలను చంపేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం తక్షణం జోక్యం చేసుకుని దాడుల నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించాలని మమత అభ్యర్థించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కుమారుడు శీర్షాన్య బందోపాధ్యాయ వేసిన పిటిషన్పై విచారణకు ఆయన తరఫున మమత హాజరయ్యారు. ఈ కేసులో పోలీసుల తరఫు న్యాయవాది ధీరజ్ త్రివేది వాదనలు వినిపించారు. ఈ వివరాలను చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ పార్థసారథి సేన్లతో కూడిన బెంచ్ నమోదుచేసింది. మధ్యంతర ఆదేశాలు కోరుతూ దాఖలైన పిటిషన్పై తీర్పును రిజర్వు చేసింది. కాగా, నల్లకోటులో మమత కోర్టుకు రావడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. బెంగాల్లో ‘సర్’ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)ను ఆపాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె నల్లకోటుతో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.