Share News

భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేసేందుకు ప్లాన్.. సంచలనం రేపుతున్న ఘటన..

ABN , Publish Date - Aug 13 , 2026 | 03:13 PM

భర్తను హత్య చేసేందుకు ఓ మహిళ సినిమా రేంజ్‌లో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, ఆపై ఇంటి వెనుక పాతిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేసేందుకు ప్లాన్.. సంచలనం రేపుతున్న ఘటన..

ముంబై: భర్తను హత్య చేసేందుకు ఓ మహిళ సినిమా రేంజ్‌లో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, ఆపై ఇంటి వెనుక పాతిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు నెట్టింట వైరల్‌గా మారాయి. భర్తలను హత్య చేసిన మహిళల ఉదంతాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న వేళ, తాజా ఘటన ప్రకంపనలు రేపుతోంది. కట్టుకున్న వాడిని హతమార్చేందుకు భార్య చేసిన ప్రయత్నాలు చూసి అంతా నివ్వెరపోతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..


మహారాష్ట్రలోని బారామతిలో షర్మిలా ప్రవీణ్ జగ్‌తాప్ అనే మహిళ తన భర్త ప్రవీణ్ జగ్‌తాప్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. జులై 30న జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి భర్త, అత్తకు ఇచ్చింది. జ్యూస్ తాగిన వారిద్దరూ రెండు రోజుల పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆగస్టు 1న బాధితుడికి కొంచెం మెలకువ వచ్చింది. అది గ్రహించిన షర్మిల.. అతడిని బ్యాట్‌తో దారుణంగా కొట్టింది. అనంతరం లాక్కెళ్లి, ఇంటి వెనుక అప్పటికే ఇటుకలతో కట్టించిన గుంతలో పడేసింది. భర్త కనిపించకుండా ఆ గుంతపై పెద్ద చెక్కను పెట్టింది.


కూలీలను పిలిపించి ఆ గుంతను పూడ్చేందుకు ప్రయత్నించింది. కూలీలకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు, కుమారుడు ప్రవీణ్ జగ్‌తాప్‌ను బ్యాట్‌తో కొడుతున్న సమయంలోనే తల్లికీ స్పృహ వచ్చింది. వెంటనే తన పెద్ద కుమారుడికి ఫోన్ చేసింది. దీంతో బాధితుడి అన్న, పోలీసులు వచ్చి అతడిని రక్షించారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం షర్మిలను అరెస్టు చేశారు.


బాధితుడి ఆవేదన..

అయితే, పూర్తి స్పృహలోకి వచ్చిన ప్రవీణ్ జగ్‌తాప్ కీలక విషయాలు వెల్లడించాడు. 'నా భార్య నాకు నిద్రమాత్రలు ఇచ్చింది. మూడో రోజు మెలకువ రావడంతో నాపై దాడి చేసింది. ఆ తర్వాత నన్ను గుంతలో పడేసింది. కార్మికులు నన్ను గమనించి పోలీసులకు ఫోన్ చేయడంతో నా ప్రాణాలు నిలబడ్డాయి. మా అన్నయ్య నన్ను రక్షించి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నా భార్య అమావాస్య రోజులైన జులై 13, 14 తేదీలలో క్యాలెండర్‌పై ‘ఫలితం లేదు’ అని రాసింది. ఈ హత్యాయత్నం వెనుక చేతబడి లేదా క్షుద్రవిద్యల కోణం ఉండొచ్చని అనుమానంగా ఉంది. అత్తమామలు నా ఇద్దరు పిల్లలను తీసుకెళ్లిపోయారు. వారి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. పోలీసులు వారిని కాపాడాలి' అని పేర్కొన్నాడు. కాగా, థ్రిల్లర్ సినిమాను తలపించిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..

మహారాష్ట్రలోని నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి..

Updated Date - Aug 13 , 2026 | 03:47 PM