ఫైర్ ఇంజిన్తో ఎమ్మెల్యే కారును కడిగిన సిబ్బంది.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 26 , 2026 | 02:58 PM
మధ్యప్రదేశ్లో ఓ ఎమ్మెల్యే కారును ఫైర్ ఇంజిన్ నీటితో కడిగిన వైనం ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్లో ఓ ఎమ్మెల్యే కారును ఫైర్ ఇంజిన్ నీటితో కడిగిన వైనం ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సింగ్రౌలీ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. అది బీజేపీ ఎమ్మెల్యే రామ్ నివాస్ షా ప్రైవేటు కారు అని తేలడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లోని పైపుతో నీటిని జల్లుతూ కారును కడిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బిలాంజీలోని ఎమ్మెల్యే అధికారిక నివాసం ముందు నిలిపి ఉంచిన కారును సిబ్బంది కడిగారు.
ఈ ఉదంతంపై ఎమ్మెల్యే షా కూడా స్పందించారు. ‘నేను ఆ వీడియోను చూశాను. తమ నివాసం వద్ద అనుకోకుండా ఫైర్ ఇంజిన్ను పార్క్ చేశారని డ్రైవర్ చెప్పాడు. ఈ క్రమంలో తాను నీటిని కారుపై స్ప్రే చేసినట్టు చెప్పాడు. అలా చేయకుండా ఉండాల్సిందని నేను డ్రైవర్కు చెప్పాను’ అని ఎమ్మెల్యే షా పేర్కొన్నారు. అయితే, అగ్నిప్రమాదాలకు వాడాల్సిన ఫైర్ ఇంజిన్ను ఇలాంటి పనులకు వినియోగించడంపై ప్రస్తుతం నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటన నేపథ్యంలో ప్రతిపక్షం బీజేపీ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించింది. ‘సామాన్యులకు అవసరమైనప్పుడు ఫైర్ ఇంజిన్లు సమాయానికి రావు. కానీ సింగ్రౌలీలో మాత్రం బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ ఇంజిన్ను తమ ప్రైవేటు కారు వాషింగ్ సెంటర్గా మార్చుకున్నారు’ అని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.
ఈ వార్తలనూ చదవండి:
బ్రో.. కాస్త ఆగు: రాహుల్కు కంగనా రనౌత్ కౌంటర్
రేపు యువతతో ప్రధాని సంభాషణ.. ‘ఖేలో ఇండియా డైలాగ్’లో పాల్గొననున్న మోదీ