కర్ణాటకలో యువతిపై గ్యాంగ్ రేప్
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:16 AM
కుటుంబ సమస్యలతో నలిగిపోయి, దిక్కుతోచని స్థితిలో ఒంటరి ప్రయాణం ప్రారంభించిన యువతి(22) పట్ల కొందరు దారుణంగా ప్రవర్తించారు. పెళ్లి చేసుకుంటామని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఇద్దరు రైల్వే పోలీసులు సహా
ఆరుగురిపై కేసు నమోదు
బళ్లారి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): కుటుంబ సమస్యలతో నలిగిపోయి, దిక్కుతోచని స్థితిలో ఒంటరి ప్రయాణం ప్రారంభించిన యువతి(22) పట్ల కొందరు దారుణంగా ప్రవర్తించారు. పెళ్లి చేసుకుంటామని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డారు. కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తిప్పి, బెదిరించి, పదే పదే దారుణానికి ఒడిగట్టారు. వారి చెర నుంచి తప్పించుకుని, బస్సు ఎక్కిన ఆమె.. బోరున విలపిస్తుండటంతో తోటి ప్రయాణికుడు ఆరా తీసి.. డయల్ 112కు సమాచారం ఇచ్చాడు.
వెయిటింగ్ హాల్లో మొదలై..
బాధితురాలు బెంగళూరు నుంచి రైలులో యాదగిరి చేరుకుని, అక్కడి వెయిటింగ్ హాల్లో ఉండగా, మల్లప్ప అనే వ్యక్తి పలకరించాడు. సాయం చేస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతంగా లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత శరణప్ప అనే రైల్వే పోలీసు, మరో పేరు తెలియని రైల్వే పోలీసు అక్కడికి చేరుకుని బాధితురాలిని భయపెట్టి లైంగిక దాడి చేశారు. అనంతరం మల్లప్ప ఆమెను తిరిగి రైల్వేస్టేషన్లో వదిలేశాడు. అక్కడికి మహేశ్ అనే వ్యక్తి వచ్చి ఆమెను కలిశాడు. బస్టాండు సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
తర్వాత బాధితురాలు కలబురగికి వెళ్లిపోగా, సుమారు నెల తర్వాత మల్లప్ప ఆమెను వెతికి పట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, షాహాపూర్కు తీసుకెళ్లి అక్కడి ఓ లాడ్జిలో లైంగిక దాడి చేశాడు. వేధింపులు పెరగడంతో ఆమె తిరిగి బెంగళూరుకు వెళ్లేందుకు యాదగిరి రైల్వేస్టేషన్కు చేరుకుంది. అక్కడ రమేశ్, ఆకాశ్, హర్ష అనే ముగ్గురు ఆమెను ట్రాప్ చేశారు. కారులో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆకాశ్ లైంగిక దాడి చేశాడు. కొద్దిరోజుల తర్వాత హర్ష కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనపై జరిగిన దారుణాల గురించి బాధితురాలు ఓ వ్యక్తికి చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఆరుగురిని నిందితులుగా చేర్చారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ కుటుంబానికి సీఎం రేవంత్ అండ
ఫ్యూచర్ సిటీలో ఎస్బీఐ డేటా సెంటర్ ఏర్పాటు.. 10 ఎకరాలు కేటాయించిన సర్కార్