పశ్చిమాసియా ప్రభావం వ్యవసాయంపై లేదు.. కేంద్రం స్పష్టత
ABN , Publish Date - Apr 01 , 2026 | 09:21 PM
పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం మన వ్యవసాయరంగం, రైతులపై ఎంతమాత్రం ఉండదని కేంద్రం ప్రకటించింది. ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది.
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం మన వ్యవసాయరంగం, రైతులపై ఎంతమాత్రం ఉండదని కేంద్రం ప్రకటించింది. ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి మణిందర్ కౌర్ ద్వివేది బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో తమ మంత్రిత్వ శాఖ సమగ్ర సమీక్ష జరిపిందని, రానున్న ఖరీప్ సీజన్కు అవసరమైన ముడిసరుకులకు సన్నాహాలు చేసిందని, తగినన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ఈ ఖరీఫ్ సీజన్లో 166.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని, మనవద్ద 185.74 లక్షలు ఉన్నాయని, ఆ ప్రకారం 19.24 లక్షల క్వింటాళ్ల మేర విత్తనాల మిగులు ఉందని ద్వివేది వివరించారు. మిగులు విత్తనాల్లో ధాన్యం, సోయాబిన్, వేరుశెనగ, మొక్కజొన్న, పప్పుధాన్యాలు వంటివి ఉన్నట్టు చెప్పారు. హైబ్రీడ్ మొక్కజొన్న విత్తనాలను ఎండబెట్టే విషయంలో ఎల్జీపీ సమస్య ఉన్నప్పటికీ పెట్రోలియం మంత్రిత్వ శాఖ సమన్వయంతో పరిష్కరించామని తెలిపారు. రబీ పంట విత్తనాల విషయంలోనూ ప్రభుత్వం కంఫర్టబుల్ పొజిషిన్లో ఉందన్నారు.
ఎరువులు, క్రిమిసంహారక మందులు
ఖరీఫ్ పంటలకు 390.52 ఎల్ఎంటీ ఎరువులు అవసరమని, సుమారు 180 ఎల్ఎంటీ (46 శాతం) ఓపినింగ్ స్టాక్గా అందుబాటులో ఉందని ద్వివేది చెప్పారు. ఆగ్రో పెస్టిసైడ్స్పై మాట్లాడుతూ, 2.5 లక్షల మెట్రిక్ టన్నుల క్రిమిసంహారకాలు అందుబాటులో ఉన్నాయని, ఇది అవసరమైన దానికంటే ఎక్కువేనని చెప్పారు. అన్ని వ్యవసాయ ఉత్పత్తుల హోల్సేల్ ధరలు కూడా స్థిరంగానే ఉన్నట్టు ద్వివేది చెప్పారు. గత కొద్ది సంవత్సరాలుగా ధరలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని, టొమాటో, ఉల్లి, బంగాళాదుంప వంటి ప్రధాన పంటల ధరలు మెరుగ్గా ఉన్నాయని, హోల్సేల్ మార్కెట్ మెరుగవుతోందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఎల్డీఎఫ్, యూడీఎఫ్కు కొత్త నిర్వచనం... సాగనంపండని రాజ్నాథ్ పిలుపు
కాంగ్రెస్ ప్రిన్స్కు వందోసారి కూడా ఓటమి ఖాయం: మోదీ