ఐఈఏ అభ్యర్థనను తిరస్కరించిన భారత్!
ABN , Publish Date - Mar 10 , 2026 | 08:12 PM
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక నిల్వల నుంచి చమురు విడుదల చేయాలని ఐఈఏ భారత్ను కోరింది. అయితే దేశీయ అవసరాలకే ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ భారత్ ఈ అభ్యర్థనను తిరస్కరించినట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కట్టడికి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) భారత్ సాయాన్ని కోరినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ధరల స్థిరీకరణ కోసం భారత్ తన వ్యూహాత్మక నిల్వల నుంచి కొంత చమురును గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేయాలని ఐఈఏ కోరిందట. అయితే, భారత్ ఈ అభ్యర్థనను తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితికి తాము కారణం కాదని స్పష్టం చేసిందట. తాము దేశీయ అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని భారత్ పేర్కొన్నట్టు కథనాలు వెలువడ్డాయి.
మధ్య ప్రాచ్యంలో యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో, ఐఈఏ రంగంలోకి దిగింది. ధరలకు అడ్డుకట్ట వేసేందుకు సభ్య దేశాలు తమ వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి కొంత గ్లోబల్ మార్కెట్స్లోకి విడుదల చేయాలని కోరింది. ఈ క్రమంలో జీ7 దేశాలు సమావేశమై ఐఈఏ సూచనకు సానుకూలంగా స్పందించాయి. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పాయి.
ఇక ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతీహ్ బైరోల్ త్వరలో భారత్తో ఈ విషయమై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, 2021లో అమెరికాకు సహాయంగా భారత్ తన ముడి చమురు నిల్వల నుంచి 5 మిలియన్ బ్యారెల్స్ను విడుదల చేసింది. ఇక ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో భారత్ సభ్య దేశం కాదు. కేవలం అనుబంధ దేశంగా మాత్రమే కొనసాగుతోంది.
ఈ వార్తలూ చదవండి:
గుడ్ న్యూస్.. 13న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు..
ఎల్పీజీపై ఆందోళన వేళ.. కేంద్రం కీలక నిర్ణయం