కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం! ప్రైవేటు రంగానికి ఫైటర్ జెట్ను అభివృద్ధి చేసే ఛాన్స్
ABN , Publish Date - May 27 , 2026 | 06:15 PM
అత్యాధునిక మధ్యశ్రేణి ఫైటర్ జెట్ నిర్మాణానికి ప్రైవేటు రంగం నంచి ప్రతిపాదనలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక ప్రకటనను విడుదల చేసింది.
ఇంటర్నె్ట్ డెస్క్: అత్యాధునిక ఫైజర్ జెట్స్ అభివృద్ధిలో స్వావలంబన దిశగా కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక మధ్యశ్రేణి కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఏఎమ్సీఏ) అభివృద్ధి కోసం తొలిసారిగా ప్రైవేటు సంస్థల నుంచి ప్రతిపాదనలు కోరుతూ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) ప్రకటనను విడుదల చేసింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్అండ్టీ బీఈఎల్- డైనమాటిక్ కన్సార్షియంతో పాటు భారత్ ఫోర్జ్-బీఈఎమ్ఎల్-డాటా పాటర్న్స్ కన్షార్షియంకు ఈ 5వ తరం ఫైటర్ జెట్కు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది.
రూ.15 వేల కోట్ల విలువైన ఈ ప్రభుత్వ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలకు ఏఎమ్సీఎకు సంబంధించి ఐదు ప్రొటోటైప్ మోడల్స్ (నమూనా), ఒక ప్రయోగాత్మక ఫైటర్జెట్ను నిర్మించే అవకాశం దక్కుతుంది. ఫైటర్ జెట్ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు, స్వావలంబన సాధించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు నిధులను కేంద్రం పూర్తిస్థాయిలో సమకూరుస్తుంది. అయితే, ప్రాజెక్టును దక్కించుకున్న ప్రైవేటు సంస్థలు ఎయిరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), డీఆర్డీఓతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. పుట్టపర్తిలో (ఏపీ) 650 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఎయిర్క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్లో ఏఎమ్సీఏ అభివృద్ధి చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏడీఏ, డీఆర్డీఓ 2025లో ఒక ప్రకటనను విడుదల చేశాయి. ఫైటర్ జెట్ అభివృద్ధిపై ఆసక్తిగల వారు తమను సంప్రదించాలని కోరాయి. ఇందుకు 7 సంస్థలు స్పందించగా మూడు సంస్థలు మలిదశకు ఎంపికయ్యాయి. ఈ సంస్థలు తమ బిడ్స్ను సమర్పించేందుకు ప్రభుత్వం మూడు నెలల సమయం ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రాజెక్టు కేటాయింపు పూర్తయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధానమంత్రి మోదీని కలిసిన సీఎం విజయ్
కర్ణాటక నుంచి మూడు రాజ్యసభ సీట్లు వీరికే