Share News

నందల్‌ ముఠాకు మాస్టర్‌ స్ట్రోక్‌

ABN , Publish Date - Jul 11 , 2026 | 06:11 AM

హరియాణాలోని గురుగ్రామ్‌లో గురువారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరుడుగట్టిన దీపక్‌ నందల్‌ గ్యాంగుకు చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఒక గ్యాంగ్‌స్టర్‌తోపాటు...

నందల్‌ ముఠాకు మాస్టర్‌ స్ట్రోక్‌

  • గురుగ్రామ్‌ ఎన్‌కౌంటర్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్ల కాల్చివేత

  • వ్యాపారవేత్త విశాల్‌ బేరీ కిడ్నాప్‌నకు నందల్‌ గ్యాంగ్‌ యత్నం

  • విశాల్‌ ఇంటిపై దాడి.. విచక్షణా రహితంగా కాల్పులు

  • ముందుగానే పసిగట్టి ఇంటివద్ద మాటువేసిన పోలీసులు

  • ఎదురుకాల్పుల్లో నలుగురి మృతి.. వీరిలో ఒకరు ఇంటర్‌ విద్యార్థి

గురుగ్రామ్‌, జూలై 10: హరియాణాలోని గురుగ్రామ్‌లో గురువారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరుడుగట్టిన దీపక్‌ నందల్‌ గ్యాంగుకు చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఒక గ్యాంగ్‌స్టర్‌తోపాటు ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులు ఓ యాక్షన్‌ సినిమాను తలపిస్తున్నాయి. విదేశాల్లో ఉండి భారత్‌లో తన గ్యాంగును నడిపిస్తున్న దీపక్‌ నందల్‌ ప్రముఖ వ్యాపారవేత్త విషాల్‌ బేరీని టార్గెట్‌ చేశాడు. కొన్నిరోజులుగా ఆయనను ఫోన్‌కాల్స్‌, ఎస్‌ఎంఎ్‌సల ద్వారా కోట్ల రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నాడు. ఆయన స్పందించకపోవటంతో తన గ్యాంగును నేరుగా రంగంలోకి దింపి బెదిరించాలని ప్లాన్‌ వేశాడు. అందులో భాగంగా నందల్‌ గ్యాంగులోని ఆర్యన్‌, నితిన్‌, అంకిత్‌, సందీప్‌, శివమ్‌ అనే గ్యాంగ్‌స్టర్లు ఒక నలుపురంగు స్కార్పియో వాహనంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో గురుగ్రామ్‌లోని సుశాంత్‌ లోక్‌లో ఉన్న బే దీ నివాసంలోకి దూసుకొచ్చి కాల్పులు మొదలుపెట్టారు. ఈ వ్యవహారాన్ని దీపక్‌ నందల్‌కు తెలిపేందుకు ఆ దృశ్యాలను గ్యాంగులోని ఒక వ్యక్తి వీడియో తీయటం మొదలుపెట్టాడు. అయితే, నందల్‌ కోసం చాలాకాలంగా వెదుకుతున్న హరియాణా పోలీసులు.. ఈ గ్యాంగు కదలికలను కొద్దిరోజులుగా దగ్గరి నుంచి గమనిస్తున్నారు. ఈ విషయం తెలియని గ్యాంగు.. అత్యాధునిక ఆయుధాలతో ఏకంగా బేరీ ఇంటిపై దాడిచేసింది. నిఘా వర్గాల సమాచారంతో అప్పటికే ఆ ఇంటివద్ద మాటువేసి ఉన్న క్రైమ్‌బ్రాంచ్‌ యాక్షన్‌ టీం వెంటనే రంగంలోకి దిగింది.


లొంగిపోవాలని వారిని హెచ్చరించింది. గ్యాంగ్‌స్టర్లు అదేమీ పట్టించుకోకుండా పోలీసులపై కాల్పులు మొదలుపెట్టడంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 60 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో రోహ్‌తక్‌కు చెందిన ఆర్యన్‌, నితిన్‌, అంకిత్‌తోపాటు ఫతేహాబాద్‌కు చెందిన సందీప్‌ అలియాస్‌ దీప మరణించారు. వీరిలో ఒక వ్యక్తి 11వ తరగతి విద్యార్థి అని సమాచారం. నూహ్‌ జిల్లా కోటాబైసర్‌కు చెందిన శివమ్‌తోపాటు ఏఎ్‌సఐ సునీల్‌, కానిస్టేబుళ్లు మన్‌జీత్‌, శంషేర్‌ గాయపడ్డారు. వీరిని మేదాంత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో ఇంట్లో బేరీ ఒక్కరే ఉన్నారు. ఆయనను పోలీసులు సురక్షితంగా కాపాడారు.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 11 , 2026 | 06:11 AM