పెళ్లై రెండు సంవత్సరాలు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి..
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:29 AM
పెళ్లైన రెండేళ్లకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన బిహార్లో చోటుచేసుకుంది. పోలీసులు అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.
లఖ్నవూ, జూన్ 1: పెళ్లైన రెండేళ్లకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన బిహార్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లఖ్నవూకు చెందిన సాగర్ రాజ్పుత్కు 2024లో కాన్పూర్కు చెందిన మాన్షితో పెళ్లయింది. మాన్షి తల్లిదండ్రులు వరకట్నం కింద 7 లక్షల నగదు, ఇంటి సామాన్లు, ఇతర బహుమతులు ఇచ్చారు. పెళ్లైన కొంతకాలం వీరి కాపురం బాగానే సాగింది. ఇద్దరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సాగర్కు ఇన్స్టాలో 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కలిసి వీడియోలు చేసే వారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, మాన్షి అత్తింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కూతురి మరణంపై మాన్షి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదనపు కట్నం కోసం తమ కూతురిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. ‘పెళ్లి సమయంలో వరకట్నం కింద 7 లక్షల నగదు, ఇంటి సామాన్లు, ఇతర బహుమతులు ఇచ్చాం. అయినా వాళ్లకు సంతృప్తి కలగలేదు. అదనపు కట్నం కోసం నా కూతురిని హింసిస్తున్నారు. కారు కావాలని అడుగుతున్నారు. తక్కువ కట్నం తెచ్చిందని అంటూ మాన్షిని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నారు’..
‘వేధింపుల గురించి మాతో చెప్పుకుని మాన్షి చాలా ఏడ్చేది. మాన్షి అత్తింటి వారికి సర్ధి చెప్పటం కోసం పలుమార్లు లఖ్నవూ వెళ్లి వచ్చాము. మా కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని శనివారం ఫోన్ కాల్ వచ్చింది. మా కూతురిది ముమ్మాటికీ హత్యే. మాన్షిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు’ అని అన్నారు. పోలీసులు సాగర్తో పాటు మరో ఐదుగురిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రవాసాంధ్రులకు వారధిగా ఉండటం మహాభాగ్యం: జయరాం కోమటి
బెట్టింగ్ రాకెట్పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్