బల్క్ డీజిల్ కొనుగోళ్లపై ఆంక్షలు.. ఆసుపత్రుల్లో ఆందోళన
ABN , Publish Date - Jun 14 , 2026 | 11:34 AM
బల్క్ పెట్రోల్ కొనుగోళ్లపై ఆంక్షలతో ఇబ్బందులు తలెత్తుతాయని ఆసుపత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆంక్షల నుంచి మినహాయింపు కావాలని ఐటీ, టెలికం సేవల సంస్థలు కూడా కోరుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: రిటైల్ పెట్రోల్ బంకుల్లో వాణిజ్య అవసరాల కోసం ఇంధనాన్ని బల్క్లో కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలతో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆసుపత్రులు, ఐటీ సేవల సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీజిల్ జనరేటర్లపై అధికంగా ఆధారపడే తమకు తాజా ఆంక్షలతో ఇక్కట్లు తప్పవని చెబుతున్నాయి.
ఈ ఆంక్షలపై ఆసుపత్రుల ప్రతినిధులు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరా లేని సమయాల్లో అనేక భారీ ఆసుపత్రులను డీజిల్ జనరేటర్లను వినియోగిస్తుంటాయి. ఇక సర్జరీలు, ఐసీయూల కోసం సాధారణ సమయాల్లో కూడా డీజిల్ జనరేట్లర్లను వినియోగిస్తుంటాయి. వోల్టేజ్లో చిన్న తేడా వచ్చినా పేషెంట్లు రిస్క్లో పడే అవకాశం ఉండటంతో తాము డీజిల్ జనరేటర్లపై ఆధారపడతామని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ‘క్రిటికల్ కార్యకలాపాల కోసం చాలా ఆసుపత్రులు కేవలం గ్రిడ్ ఎలక్ట్రిసిటీపైనే ఆధారపడవు. ఆసుపత్రుల్లో నిరంతర విద్యుత్ సరఫరా అవసరం కాబట్టి నిత్యం డీజిల్ జనరేటర్లను వినియోగిస్తుంటాయి’ అని ఒక ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు.
డేటా సెంటర్లు, ఐటీ పార్కులు, టెలికం సంస్థలకు కూడా డీజిల్ జనరేటర్లు కీలకం అని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో చాలా సంస్థలు సమీప పెట్రోల్ బంకుల నుంచి డీజిల్ కొనుగోలు చేసి నిల్వలు తగ్గకుండా చూసుకుంటాయి. ‘విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే సమయాల్లో డీజిల్ జనరేటర్ల వినియోగం లాభదాయకంగా ఉంటుంది’ అని ఐటీ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. బల్క్లో ఇంధన కొనుగోళ్ల కోసం ఒప్పందాలు చేసుకున్న వారికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తక్షణ అవసరాల కోసం సాధారణ పెట్రోల్ బంక్లపై ఆధారపడే సంస్థలకు ఇక్కట్లు ఎక్కువని చెబుతున్నారు. ఆసుపత్రులు, టెలికం నెట్వర్క్, డేటా సెంటర్ల వంటి కీలక మౌలికవసతులకు ఇబ్బందులు లేకుండా కొంత సడలింపుల కోసం ఇండస్ట్రీ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
కనీసం సంతాపం కూడా తెలియజేయరా? యూఎస్పై శశి థరూర్ ఆగ్రహం
పిల్లిని కాపాడ్డానికి వెళ్లి.. ఐసీయూలో ప్రాణాలకోసం పోరాటం..