ఉక్రెయిన్లో వాణిజ్య నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి
ABN , Publish Date - Jul 20 , 2026 | 09:28 PM
ఉక్రెయిన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై తాజాగా జరిగిన దాడిలో నలుగురు భారతీయులు మరణించారని విదేశాంగ శాఖ తాజాగా తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై తాజాగా జరిగిన దాడిలో నలుగురు భారతీయులు మరణించారని విదేశాంగ శాఖ తెలిపింది. ఆదివారం ఒడెశా పోర్టు నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభించిన ఎమ్వీ గోల్డెన్ లియోపై ఈ దాడి జరిగిందని తెలిపింది. ఈ దాడిలో గాయపడ్డ మరో భారతీయుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొంది. దాడి సమయంలో నౌకలో ఐదుగురు భారతీయులు సహా మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు.
ఉక్రెయిన్లో పరిస్థితిని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగ శాఖ తెలిపింది. క్షతగాత్రులకు అన్ని రకాల సహాయసహకారాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసింది. గాయపడ్డ వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు వెల్లడించింది.
ఈ ఘటనను భారత్ ఖండించింది. వాణిజ్య నౌకలను, పౌర సిబ్బందిని టార్గెట్ చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. వాణిజ్యానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని పేర్కొంది. ఈ దాడులు గర్హనీయమని తెలిపింది. ఇటీవల గల్ఫ్ ఉద్రిక్తతల నడుమ ఆయిల్ ట్యాంకర్లపై జరిగిన దాడుల్లో పలువురు భారతీయులు కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
అప్పటివరకూ దీక్ష కొనసాగిస్తా: సోనమ్ వాంగ్చుక్
తెలంగాణలో కొత్త విమానాశ్రయాలపై కేంద్రం క్లారిటీ..