రైతుగా మారిన టెకీ.. పిడుగుపాటుకు గురై దుర్మరణం
ABN , Publish Date - May 28 , 2026 | 04:53 PM
సాఫ్ట్వేర్ జాబ్ను వదిలి వ్యవసాయ రంగంలోకి దిగిన ఒక వ్యక్తి పొలంలో పిడుగుపాటుకు గురై మరణించిన ఘటన బుధవారం కర్ణాటకలో చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: సాఫ్ట్వేర్ జాబ్ను వదిలి వ్యవసాయ రంగంలోకి దిగిన ఒక వ్యక్తి పొలంలో పిడుగుపాటుకు గురై మరణించిన ఘటన బుధవారం కర్ణాటకలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, మడికేరి టౌన్కు చెందిన రోషన్ బాలకృష్ణ ఇటీవలే సాఫ్ట్వేర్ జాబ్కు రాజీనామా చేసి వ్యవసాయ రంగంలోకి దిగారు. తన స్నేహితుడితో కలిసి పనిచేస్తున్నారు. వ్యవసాయ యంత్రాల మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు నిర్ణయించిన ఆయన మైసూరులోని ఒక పొలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఆయన వెంట భార్య, కొడుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలో పొలం సమీపంలోని చెట్టు నుంచి మామిడి పండును ఆయన కోసేందుకు ప్రయత్నిస్తుండగా పిడుగు పడింది. దీంతో, కుప్పకూలిన రోషన్ ఘటనా స్థలంలోనే మరణించారు. ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా స్వలంగా గాయపడ్డారు.
బాధిత కుటుంబానికి జిల్లా విపత్తు నిర్వహణ విభాగం రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ఇందులో రూ.4 లక్షలు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి, మిగతా మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధి నుంచి బాలకృష్ణ కుటుంబానికి అందజేయనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
కేరళంలో ఈడీ బృందంపై దాడి కేసు.. 8 మంది అరెస్టు
జయనగర్-ఉద్నా అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం..