మనస్పర్థలు వివాదాలుగా మారకూడదు
ABN , Publish Date - Sep 13 , 2026 | 03:57 AM
భారత్-చైనా మధ్య సరిహద్దుతోపాటు ఇతర అంశాలపై ఏర్పడే అభిప్రాయ బేధాలను వివాదాలుగా మారకుండా జాగ్రత్తలు తీసుకుందామని ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నిర్ణయించారు.
సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం
ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ నిర్ణయం
ప్రధాని మోదీ, జిన్పింగ్ నిర్ణయం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: భారత్-చైనా మధ్య సరిహద్దుతోపాటు ఇతర అంశాలపై ఏర్పడే అభిప్రాయ బేధాలను వివాదాలుగా మారకుండా జాగ్రత్తలు తీసుకుందామని ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నిర్ణయించారు. రెండు దేశాల మధ్య సుదీర్ఘ సన్నిహిత సంబంధాల కోసం కలిసి పనిచేద్దామని జిన్పింగ్ తెలిపారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు శనివారం భారత్కు వచ్చిన జిన్పింగ్తో.. మోదీ సమావేశమయ్యారు. 50 నిమిషాలపాటు సాగిన ఈ భేటీలో.. రెండుదేశాల మధ్య గాల్వాన్ ఘర్షణ తర్వాత ఏర్పడిన అపనమ్మకాలను తొలగించుకొనే దిశగా చర్చలు జరిగినట్లు విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. చర్చల అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని తెలిపారు.
బ్రిక్స్ కూటమిని మరింత బలోపేతం చేసేందుకు భారత్తో కలిసి పనిచేస్తామని జిన్పింగ్ వెల్లడించారు. ప్రపంచంలో అతిపెద్ద దేశాలైన భారత్- చైనా ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని వేగంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీని ఇప్పటివరకు 21సార్లు కలిసినట్లు గుర్తుచేశారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో అంతరాన్ని తగ్గించటం తమకు ఎంతో కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. మలేషియా, వియత్నాం, యూఏఈ, ఇథియోపియా పాలకులతో కూడా ప్రధాని మోదీ వేర్వేరుగా సమావేశమై క్రిటికల్ మినరల్స్, ఇంధనం, ఆహార భద్రత తదితర అంశాలపై చర్చించారు.
ఈ వార్తలు కూడా చదవండి..