బాత్రూములో యువతి శవం.. నాలుగు రోజుల తర్వాత..
ABN , Publish Date - Apr 13 , 2026 | 09:27 PM
ఓ యువతి సగం కాలిన స్థితిలో ఇంటి బాత్రూములో శవమై కనిపించింది. యువతి చనిపోయిన 4 రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో శవం బయటపడ్డం స్థానికులను షాక్కు గురి చేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: జార్ఖండ్లో ఒళ్లుగగుర్పొడిచే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ యువతి సగం కాలిన స్థితిలో ఇంటి బాత్రూములో శవమై కనిపించింది. యువతి చనిపోయిన 4 రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో శవం బయటపడ్డం స్థానికులను షాక్కు గురి చేసింది. చెల్లెలు చనిపోయి నాలుగు రోజులు అవుతున్నా.. శవం కుళ్లిపోతున్నా యువతి అన్న ఈ విషయాన్ని బయటకు చెప్పకపోవటం తీవ్ర చర్చకు దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ధన్బాద్కు చెందిన లిపిక అనే యువతి.. తండ్రి, ఇద్దరు అన్నలతో కలిసి గోవింద్పూర్లోని ఇంట్లో నివసిస్తోంది.
2023లో తండ్రి చనిపోవటంతో లిపిక డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఏప్రిల్ 7వ తేదీన తీవ్ర అనారోగ్యానికి గురైంది. వాంతులు కూడా చేసుకుంది. అన్న ప్రణవ్ ఆమెకు సపర్యలు చేశాడు. అయితే, యువతి ఆరోగ్యం కుదుటపడలేదు. కొద్దిసేపటి తర్వాత ప్రాణాలు కోల్పోయింది. లిపిక మరణించి నాలుగు రోజులు గడిచిపోయాయి. చెల్లెలు చనిపోయిన సంగతి ప్రణయ్ ఎవ్వరికీ చెప్పలేదు. ఆ శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్నాడు. నాలుగు రోజులు గడిచే సరికి శవం కుళ్లి పురుగులు పట్టాయి.
చెల్లెలి శవానికి పురుగులు పట్టడంతో ప్రణయ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ ఇంటినుంచి శవం కాలుతున్న వాసన రావటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రణయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. బాత్రూములో లిపిక శవం వెలుగు చూసింది. పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లిపిక ఇద్దరు అన్నలను విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రియల్ టైమ్ గవర్నెన్స్పై సీఎం చంద్రబాబు సమీక్ష
ఏపీ కేబినెట్ ఎజెండా తయారీ ప్రక్రియలో మార్పులు..