ఉగ్ర కుట్ర భగ్నం.. పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్న 9 మంది అరెస్టు
ABN , Publish Date - May 30 , 2026 | 03:00 PM
ఢిల్లీ పోలీసులు తాజాగా ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్న 9 మందిని అరెస్టు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులను సిద్ధమైన 9 మందిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో నిందితులకు సంబంధాలు ఉన్నాయని తెలిపారు. నిందితులు ఢిల్లీ, ముంబై, పంజాబ్ ప్రాంతాలకు చెందిన వారని చెప్పారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారని అన్నారు. వారి నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
అణుకేంద్రాలు, ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లు, పవర్ప్లాంట్ వంటి కీలకమౌలిక వసతులను ఈ ఉగ్రవాదులు టార్గెట్ చేశారని పోలీసులు తెలిపారు. భద్రతా దళాలను కూడా వారు టార్గెట్ చేసే యోచనలో ఉన్నారని అన్నారు. ఉగ్రమూకపై గత కొంతకాలంగా నిఘా పెట్టి తాజాగా అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఈ కుట్రలో పాక్ పాత్ర ఏ మేరకు ఉందీ అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. నిధులు ఎవరు ఇస్తున్నారో? ఈ ముఠాకు విదేశీ హ్యాండ్లర్లు ఎవరో? తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారం నడుమ అక్కడి పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు. నిఘా వర్గాల, కేంద్ర పారామిలిటరీ దళాలతో సమన్వయంతో అన్ని జిల్లా యూనిట్స్ హైఅలర్ట్లో ఉంటున్నాయి. ఇక గతేడాది ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులందరూ ఉన్నత విద్యావంతులు కావడంతో పోలీసులు వైట్ కాలర్ ఉగ్రవాదంపై కూడా గట్టి నిఘా పెట్టారు.
ఈ వార్తలనూ చదవండి:
నలుగురు డిప్యూటీ సీఎంలకు డీకే విముఖత.. మంత్రివర్గంలో వీరికి ఛాన్స్
మహారాష్ట్రలో కల్తీ మద్యం కలకలం.. ఐదుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్!