ఢిల్లీలో టెన్షన్ వాతావరణం.. 16 మెట్రో స్టేషన్ల మూసివేత..
ABN , Publish Date - Jul 23 , 2026 | 10:42 AM
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం ఉదయం 7:30 గంటల నుంచి నగర వ్యాప్తంగా 16 మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ (గురువారం) ఉదయం 7:30 గంటల నుంచి నగర వ్యాప్తంగా 16 మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ మూసివేత కొనసాగుతుందని వెల్లడించింది. నాలుగు రోజుల వ్యవధిలోనే మూడుసార్లు మెట్రో స్టేషన్లను మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
లోక్ కల్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమం మార్గ్, బారాఖంభా రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్థ, జనపథ్, మండి హౌస్, కేంద్ర సచివాలయం స్టేషన్లను మెట్రో అధికారులు మూసివేశారు. అలాగే ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం స్టేషన్లనూ నిలిపివేశారు. అయితే, రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ వద్ద ఇంటర్ఛేంజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు డీఎంఆర్సీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. బుధవారం కూడా డీఎంఆర్సీ 17 స్టేషన్లను మూసివేసి సాయంత్రం తెరిచింది. దీంతో వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెట్రో అధికారుల నిర్ణయంతో ఈరోజు కూడా ప్రయాణికులు నానావస్థలు పడుతున్నారు.
ఈనెల 20న పార్లమెంట్ మార్చ్కు సీజేపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజు భారీగా వస్తున్న నిరసనకారులను అడ్డుకునేందుకు పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఆ నిరసన తర్వాత కూడా జంతర్ మంతర్ వద్దకు ఆందోళనకారులు భారీగా తరలివస్తున్నారు. దీంతో నిన్న, ఈరోజు మెట్రో స్టేషన్లు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మెట్రో స్టేషన్ల మూసివేతపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించడానికి బదులుగా మెట్రో స్టేషన్లను మూసివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
సీజేపీ ఉద్యమంపై స్పందించిన సల్మాన్ ఖాన్.. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పోస్టు..
పేపర్ లీక్ దోషులను శిక్షించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు: ప్రధాని మోదీ