Share News

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వినయ్‌ కులకర్ణికి యావజ్జీవం

ABN , Publish Date - Apr 18 , 2026 | 06:34 AM

బీజేపీ నాయకుడు, ధారవాడ జిల్లా పంచాయతీ సభ్యుడు యోగేశ్‌ గౌడ హత్య కేసులో ధారవాడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వినయ్‌ కులకర్ణికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2016, జూన్‌ 15న...

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వినయ్‌ కులకర్ణికి యావజ్జీవం

  • మరో 15 మందికి కూడా యావజ్జీవమే

  • ధారవాడ బీజేపీ జడ్పీ సభ్యుడి హత్యకేసులో శిక్ష ఖరారు

బెంగళూరు, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నాయకుడు, ధారవాడ జిల్లా పంచాయతీ సభ్యుడు యోగేశ్‌ గౌడ హత్య కేసులో ధారవాడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వినయ్‌ కులకర్ణికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2016, జూన్‌ 15న జరిగిన ఈ హత్య కేసులో మరో 15 మందికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 17వ నిందితుడుగా ఉన్న ఇన్‌స్పెక్టర్‌ చన్నకేశవ టింగరికరకు ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సంతోష్‌ గజానన భట్‌ శుక్రవారం తీర్పును ప్రకటించారు. ఈ కేసులో మొత్తం 21 మందిని సీబీఐ నిందితులుగా చేర్చింది. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం 10 వేల పేజీలతో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఏ1 బసవరాజ ముత్తగి, ఏ19 శివానంద బిరాదార్‌ని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 20వ నిందితుడు వాసుదేవ రామనీలేకని, 21వ నిందితుడు సోమశేఖర్‌ బసప్ప న్యామగౌడపై సాక్ష్యాధారాలు లేనందున కేసు నుంచి విముక్తి కల్పించారు. మిగిలిన 17 మందిని దోషులుగా తేల్చింది. ఎమ్మెల్యే సహా 16మందికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధించింది. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.30 వేల జరిమానా విధించింది. కాగా, రెండేళ్లకు పైబడి శిక్ష పడితే ఎమ్మెల్యే పదవి రద్దు కానుంది. దీంతో వినయ్‌ కులకర్ణి పదవిని కోల్పోనున్నారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..

Updated Date - Apr 18 , 2026 | 06:34 AM